భళి భళిరా భళి.. బాహుబలి ప్రేక్షకుడే 'బలి': బ్లాక్ దందా ఏ రేంజ్లో ఉందో తెలుసా?
స్వయంగా డిస్ట్రిబ్యూటర్లే రంగంలోకి దిగి టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుండటంతో.. ఈ రేటు మరో వంద శాతం పెరిగింది.
రాజమహేంద్రవరం: బాహుబలి సినిమాను విస్తృతంగా మార్కెట్ చేయడంలో ఆ సినిమా యూనిట్ అంతా గ్రాండ్ సక్సెస్ అయింది. దేశం నలుమూలలా సినిమా పేరు మారుమోగేలా, రోజు ఏదో ఒక వార్త దీని చుట్టూ హల్ చల్ చేసేలా.. మొత్తం మీడియాను మేనేజ్ చేసింది.
చివరాఖరికి 'బాహుబలి' సినిమాను చూడటం అన్నది వినోదం స్టేజ్ ను దాటిపోయి.. అదొక స్టేటస్ తరహాలో జనాన్ని టికెట్ కౌంటర్ క్యూలో నిలబెట్టింది. జనం ఎలాగూ సినిమాను చూస్తారు.. కానీ టికెట్ వారి చేతుల్లోకి రావాలంటే ఎన్ని చేతులు మారుతుందో.. మారిన ప్రతీసారి ఎంత రేటు పెరుగుతుందో తెలిస్తే దీని వెనకాల ఇంత దోపిడీ జరుగుతోందా? అనిపించకమానదు.
బ్లాక్ దందా:
బాహుబలి సినిమా చుట్టూ బ్లాక్ దందా జోరుగా నడుస్తోంది. అభిమానాన్ని క్యాష్ చేసుకునే పనిలో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఆఖరికి పొలిటిషియన్స్ కూడా ఈ దందాను జోరుగా నడిపిస్తున్నారు. సినిమా ధరలను పెంచుకోవచ్చని ఓవైపు ప్రభుత్వాలే అనుమతినివ్వగా.. పెరిగిన ధరలకు మించి వీరంతా టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఫలితం ప్రేక్షకుడి జేబుకు భారీ చిల్లు.
రాజమండ్రిలో పరిస్థితి ఇది:
జిల్లాలో 190థియేటర్లలో బాహుబలి రిలీజ్ అయింది. టికెట్ రేట్లను పెంచుకోవచ్చన్న ప్రభుత్వ అనుమతుల మేరకు.. రూ.120టికెట్ రూ.200కు, రూ.80టికెట్ రూ.150వరకు రేట్లు పెంచారు. కానీ స్వయంగా డిస్ట్రిబ్యూటర్లే రంగంలోకి దిగి టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుండటంతో.. ఈ రేటు మరో వంద శాతం పెరిగింది.
అంటే ఒక్కో బాల్కనీ టికెట్ రూ.400లకు విక్రయిస్తున్నారు. అయితే ఈ టికెట్లను గంపగుత్తగా కొనుగోలు చేస్తున్న కొంతమంది దళారులు.. ప్రేక్షకులకు రూ.700 నుంచి రూ.800కు టికెట్లను విక్రయిస్తున్నారు.
బ్లాక్ దందాలో డిస్ట్రిబ్యూటర్లే:
రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం, అమలాపురం తదితర పట్టణాల్లో స్వయంగా డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్ దందాను నడిపిస్తున్నారు. టికెట్లను నేరుగా బ్లాక్ మార్కెట్ కు గంపగుత్తగా విక్రయిస్తున్నారు. రెండు మూడు రోజులకు ప్రదర్శించే టికెట్లను ముందుగానే బ్లాక్ లో అమ్మేయడంతో.. భారీ మొత్తంలో డబ్బును కూడగట్టుకున్నారు.
రాజకీయ నాయకులూ దండకుంటున్నారు:
బాహుబలి బ్లాక్ దందా కాసులు కురిపిస్తుండటంతో.. పలుకుబడిని ఉపయోగించుకుని పొలిటిషియన్స్ కూడా రంగంలోకి దిగుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు నుంచి లేదా థియేటర్ యాజమాన్యం నుంచి టికెట్లు విక్రయించి నేరుగా తమ సన్నిహితులు, అనుచరులతో బ్లాక్ మార్కెట్ లో వాటిని విక్రయిస్తున్నారు. తద్వారా భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు.
పర్యవేక్షణ లేదు:
థియేటర్ నుంచి కేవలం 10శాతం టికెట్లు మాత్రమే నేరుగా ప్రేక్షకులకు అందితే.. మిగతా 90శాతం బ్లాక్ మార్కెట్ బాట పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం ఇటువైపు తొంగి చూడలేదు. ఒకవేళ తొంగి చూసినా.. బ్లాక్ దందా నడిపిస్తున్నవాళ్లంతా పేరున్న పొలిటిషియన్స్, పలుకుబడి ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కావడంతో.. వారి పట్ల చర్యలు ఉంటాయనుకోవడం అత్యాశే. ఎటూ ప్రేక్షకుడే బాహుబలి దెబ్బకు బలైపోతున్నాడన్నది మాత్రం వాస్తవం.