ఎల్లుండి బాలయ్య నామినేషన్, కెసిఆర్పై రాములమ్మ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ ఎల్లుండి (బుధవారం) హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం పార్టీ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన బాలకృష్ణ బి ఫారం తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ... తాను ఎల్లుండి నామినేషన్ వేస్తానని చెప్పారు.

కెసిఆర్పై రాములమ్మ ఫైర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి విజయశాంతి నిప్పులు చెరిగారు. సోమవారం మెదక్లో మాట్లాడుతూ... తెరాసకు అధికారమిస్తే దోచుకుతింటుందన్నారు. తెరాస దొరల పార్టీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారన్నారు.
ఓటమి భయంతోనే కెసిఆర్ మహబూబ్ నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారన్నారు. తెరాస దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారి నైజం, కెసిఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలననే కొనసాగిస్తారని విమర్శించారు.
గడీల బతుకు తెలిసినోన్ని: పొన్నాల
తాను గడీల బతుకు తెలిసినోడినని టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కెసిఆర్లా తాను మాట తప్పలేదని, ఆయనలా దౌర్భాగ్యపు మనిషిలా ఉండొద్దనుకుంటున్నానని అన్నారు. కెసిఆర్ పిరికిపంద, వంచకున్నారు. సకల జనుల సమ్మె సమయంలో కెసిఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కెసిఆర్ పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ధిలో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని బంగారు తెలంగాణను నిర్మించేందుకు పాటు పడతామని ఆయన తెలిపారు. అమరుల త్యాగాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని పొన్నాల అన్నారు. తాను కెసిఆర్లా నయవంచకుడిని, నిరంకుశవాదిని కాదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తాము సామాజిక న్యాయం పాటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications