ఓడించాల్సిందే: జగన్ పార్టీ నానిపై బాలయ్య ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొడాలి నాని పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీ చేసి నానిని భారీ మెజార్టీతో ఓడించాలనే ఆలోచనతో ఉన్నారట.
2009 ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైయస్ జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం వెనుక జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఉన్నారనే ప్రచారం జరిగింది. దీనిని వారు కొట్టి పారేశారు. నాని.. జగన్ పార్టీలో చేరడంపై బాలయ్య నాడు తీవ్రంగా మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు గుడివాడ నుండి పోటీ చేసి నానిని భారీ మెజార్టీతో ఓడించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట. అయితే గుడివాడలో మరొకరికి టిడిపి టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తాను కాకపోయినా పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తే వారి తరఫున జోరుగా ప్రచారం చేసి నానిని చిత్తు చేయాలని భావిస్తున్నారట. అందుకు కారణం.. గుడివాడ టిడిపికి కంచుకోట కావడమే.
గుడివాడ నియోజకవర్గంలోని స్వర్గీయ నందమూరి తాకర రామారావు పుట్టిన నిమ్మకూరు ఉంది. దీంతో దీనిపై బాలయ్య ప్రత్యేకంగా దృష్టి సారించారంటున్నారు.
బాలయ్య ఎక్కడి నుండి పోటీ?
బాలకృష్ణని కేవలం రెండు ప్రాంతాల్లో ప్రచారానికి ఉపయోగించుకోవాలని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నప్పటికీ బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయమై చర్చ సాగుతోంది. పార్టీ ఆదేశిస్తే గుడివాడ నుండి పోటీకి బాలయ్య సిద్దమట. కానీ దాదాపు ఆ అవకాశం ఉండకపోవచ్చు.
తన తండ్రి పోటీ చేసి గెలిచిన మరో నియోజకవర్గం హిందూపురం పైనా బాలయ్య కన్ను ఉందంటున్నారు. ఇక్కడి నుండి నందమూరి హరికృష్ణ కూడా గతంలో గెలుపొందారు. పెనమలూరు నుండి కూడా పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా పలు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications