చంద్రబాబు జిల్లాలో జల్లికట్టుకు భారీ ఏర్పాట్లు: ముఖ్య అతిథిగా బాలయ్య
అమరావతి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజైన ఈరోజు సంప్రదాయ జల్లికట్ట పోటీలకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు. తమిళనాడుతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టుకు భారీ ఏర్పాటు చేశారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లె వాసులు జల్లికట్టు పోటీలు జరిపేందుకు సన్నాహాలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన ప్రజలు, కోర్టు అనుమతి లేకున్నా జల్లికట్టును నిర్వహించి తీరతామని చెబుతున్నారు.
ఎలాగైనా ఈ జల్లికట్టు పోటీలను నిర్వహించాలని గ్రామ ప్రజలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ పోటీలను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి సంబరాల కోసం సీఎం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా నారావారిపల్లెలో మూడు రోజులుగా అక్కడే ఉన్నారు.
ఈ క్రమంలో జల్లికట్టును ప్రారంభించేందుకు బాలకృష్ణ అక్కడికి పయనమైనట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే జల్లికట్టును నిలుపదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవానికి బాలయ్య హాజరవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతేకాదు బాలయ్యతో పాటు టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా స్వయంగా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతిఏటా జరిగే జల్లికట్టు ఉత్సవాల్లో శివప్రసాద్ ఉత్సాహంగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. జల్లికట్టులో గాయపడే వారి కోసం తక్షణ వైద్యం కోసం అంబులెన్స్లను సైతం ఏర్పాటు చేశారు.