సినిమా రాజకీయాలు పట్టించుకోను: హీరో బాలకృష్ణ
అనంతపురం: చలనచిత్ర పరిశ్రమ రాజకీయాల గురించి తాను పట్టించుకోబోనని, వాటికి తాను ఎప్పుడూ దూరంగానే ఉంటానని నందమూరి హీరో, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణ స్పష్టం చేశారు.
భారతదేశంలో యువశక్తికి కొదువలేదని, రాబోయే రోజులు మనవేనని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరి ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని, అభివృద్ధి చేసే వారికే జనం పట్టం కడతారన్నారు.
ప్రపంచంలోనే విప్లవాత్మకమైన మార్పులు, సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది ఎన్టీయారేనన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనక్కు వెళ్లిందని, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, ప్రజలంతా సహకారం అందించి ఆయన వెంట నడవాలని కోరారు.
ఎన్టీఆర్ కడుపున పుట్టడమే తాను చేసుకున్న అదృష్టంగాభావిస్తున్నానన్నారు. నటుడిగా తనకెప్పుడూ ఆయన సలహాలు, సూచనలు చేయడం కానీ, ఫలానా సినిమా చేయాలని చెప్పడం గానీ చేయలేదని, తమ రక్తం మీద ఉన్న నమ్మకం అలాంటిదన్నారు.