పేర్ని నాని వర్సెస్ ఎంపీ బాలశౌరి : ఎవరేం చేస్తారో చూస్తా - ఏం జరుగుతోంది..!!
మచిలీపట్నం లో ఎంపీ బాలశౌరి పర్యటన సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలు బయట పడ్డాయి. ఎంపీ పర్యటనను వైసీపీ కార్పొరేటర్ అస్ఘర్ అడ్డుకునే ప్రయత్నం చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇనకుదురు పేటలోని ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి కోసం నిధులివ్వాలని స్థానికులు కోరటంతో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎంపీ అక్కడకు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ తనకు చెప్పకుండా తన డివిజన్కు ఎంపీ రావటం సరికాదన్నారు. ఎంపీ వెనక్కి వెళ్లిపోవాలంటూ అనుచురులతో మోహరించి ఎంపీని అడ్డుకున్నారు.
ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో.. పోలీసులు కార్పొరేటర్ వర్గీయులను అక్కడినుంచి తరలించారు. అస్ఘర్.. పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఈ ఆందోళన వెనుక ఆయన హస్తమే ఉందని ఎంపీ వర్గం భావిస్తోంది. అస్ఘర్ చిన్న విషయానికే బాలశౌరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం వెనుక పేర్ని నాని ఉన్నారని ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని పైన ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ సుజనా తిడితే పేర్ని నాని స్పందించరని.. కొనకళ్లతో వారానికోసారైనా మాట్లాడకపోతే నానికి నిద్రపట్టదని బాలశౌరి ఫైర్ అయ్యారు.
టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికి ఒకసారైనా మాట్లాడకపోతే ఆయనకు నిద్రపట్టదంటూ వ్యాఖ్యానించారు. బందర్ నీ అడ్డా కాదు. ఇకపై బందర్లోనే ఉంటా.. కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఎవరేం చేస్తారో చూస్తా.. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా అంటూ బాలశౌరి హెచ్చరించారు. మూడేళ్లలో ఒక్కసారైనా ఒక్క కార్యక్రమానికి సొంత పార్టీ ఎంపీని పిలిచావా.. ప్రొటోకాల్ గురించి నువ్వు, నీ పక్కనున్నవాళ్లు మాట్లాడడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అభివృద్ధికి ఎప్పుడైనా సహకరించావా అంటూ నిలదీసారు. దీంతో..ఒక్క సారిగా మచిలీపట్నం వైసీపీలో కలకలం మొదలైంది. ఎంపీ - ఎమ్మెల్యే ఇద్దరూ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులే.
కానీ, ఎంపీని ఎమ్మెల్యే మద్దతు దారులు అడ్డుకోవటం.. ఎంపీ బహిరంగంగా పార్టీ ఎమ్మెల్యే..మాజీ మంత్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేయటం పైన పార్టీలో చరర్చ మొదలైంది. దీంతో..పార్టీ అధినాయకత్వం ఈ వివాదం పైన ఆరా తీస్తోంది. ఎంపీని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి.. ఎంపీ అలా వ్యాఖ్యలు ఎందుకు చేసారనే అంశం పైన వివరణ కోరినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి జగన్ సైతం కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు ఈ రకంగా వ్యవహరించటం పైన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.