బాలినేని రాజీనామా ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్, ఫ్యూచర్ పై క్లారిటీ..!!
వైసీపీ సీనియర్ నేత బాలినేని తన రాజీనామా పైన బెట్ట వీడటం లేదు. ప్రాంతీయ సమన్వయకర్త పదవికి చేసిన రాజీనామాపై డైలమా కొనసాగుతోంది. తాడేపల్లి నుంచి బాలినేనిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాను పార్టీ కార్యక్రమాలకు దూరం కావటం లేదని.. రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు మాత్రమే వద్దనుకుంటన్నట్లు బాలినేని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బాలినేని కి ఫోన్ వెళ్లిందని సమాచారం. కానీ, బాలినేని తన ఆలోచన మార్చుకోవటానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.
బాలినేని నిర్ణయం వెనుక : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసారు. తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల కో-ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన పార్టీ ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చారు. కొంత కాలంగా చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలే దీనికి కారణంగా భావిస్తున్నారు.

జిల్లాలో ప్రాధాన్యత తగ్గించేలా చోటు చేసుకుంటున్న వ్యవహారాల పైన బాలినేని మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బాలినేనిని బుజ్జగించేందుకు తాడేపల్లి నుంచి ఇద్దరు ముఖ్య నేతలు ప్రయత్నించినట్లు సమాచారం. తన సొంత జిల్లాతో పాటుగా, ఇంఛార్జ్ గా ఉన్న జిల్లాల్లో నేతలు చెప్పిన విషయాలను చేయలేకపోతున్నట్లు బాలినేని ఆవేదనలో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
జగన్ తోనే ఉంటానంటూ : ఇదే సమయంలో బాలినేని తాను జగన్ కోసం పని చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్త పదవి వదులుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. తన సొంత నియోజక వర్గంతో పాటుగా పార్టీ కోసం పని చేస్తానని జిల్లా నేతలతో వెల్లడించారు. ఇక నుంచి పూర్తి సమయం ఒంగోలు నియోజకవర్గానికి కేటాయిస్తానని చెప్పుకొచ్చారు.
స్వల్ప అస్వస్థతకు గురైన బాలినేని మరో రెండు రోజుల్లో ఒంగోలు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ యధావిధిగా పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారు. కానీ, పార్టీ ఎన్నికలకు సిద్దం అవుతున్న కీలక బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి నమ్మకం పెట్టుకున్న బాలినేని వంటి నేతలు ఇలాంటి నిర్ణయాలు ఏంటనే చర్చ పార్టీలో వినిపిస్తోంది.

సీఎంతో భేటీకి ఛాన్స్ : సీఎంతో బాలినేని సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బాలినేనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతం కంటే ప్రాధాన్యత తగ్గిందనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది. బాలినేని మంత్రివర్గ విస్తరణలోనూ తనను తప్పించి సురేష్ ను కొనసాగించటం పైన మనస్థాపానికి గురయ్యారు. ఆ సమయంలో సజ్జల రాయబారంతో సీఎం తో సమావేశమైన తరువాత బాలినేని తిరిగి తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కొద్ది రోజుల క్రితం జరిగిన సమన్యయకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి వీరంతా ఎప్పుడైనా తనను కలవచ్చని స్పష్టం చేసారు. పార్టీలో సమస్యలను పరిష్కారానికి చొరవ చూపించాలని నిర్దేశించారు. ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న బాలినేని సీఎంతో సమావేశ సమయంలో ఏం చెబుతారు, సీఎం ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications