ఇప్పటికే 4గురు ఔట్, వైసిపిలో ఆధిపత్య పోరు: ఇద్దరూ దగ్గరివారే, జగన్ మౌనం!
విజయవాడ: ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉందా? అందులో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కారణంగా వైసిపి శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు శృతి మించుతోందని చెబుతున్నారు. అధినేత వద్ద తమ మాటే నెగ్గించుకునేందుకు ఇరువురు నేతలు పంతానికి పోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఒకరి పైన మరొకరు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారట.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పని చేశారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన కోసం కాంగ్రెస్ పార్టీని వీడి వైసిపిలో చేరారు. మంత్రి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. వైవి సుబ్బారెడ్డి.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తోడల్లుడు. జగన్ పార్టీ పెట్టగానే చేరారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని పోటీ ఓడిపోయారు. పార్లమెంటు స్థానం నుంచి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసి, గెలిచారు. బాలినేని ఓటమి, వైవి సుబ్బరెడ్డి గెలుపే.. ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఓ కారణంగా భావించవచ్చునని చెబుతున్నారు.
ఓటమి కారణంగా బాలినేనికి నియోజకవర్గంలో కొంత పట్టు సడలిందని, అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి అన్నీ తానే నడిపించడం ప్రారంభించారని అంటున్నారు. అనంతరం పార్టీ పగ్గాలు బాలినేనికి అఫ్పగించారు.
జిల్లా అధ్యక్షుడిగా తొలిసారి ఒంగోలుకు వచ్చిన బాలినేనికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైవీ సుబ్బారెడ్డి మాత్రం హాజరు కాలేదు. అప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు. కొంతకాలానికి ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్లుగా కనిపించినా.. ఆ తర్వాత మళ్లీ ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.
ఇరువురి ఇళ్లు పక్క పక్కనే ఉన్నా జగన్ వచ్చినప్పుడు మినహా కలిసిన సందర్భాలు లేవని చెబుతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయ భూమి పూజకు వైవీ సుబ్బారెడ్డి హాజరు కాలేదు. భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించలేదని సుబ్బారెడ్డి వర్గం చెబుతుండగా, ఆహ్వానించామని బాలినేని వర్గం చెబుతోందని అంటున్నారు.
ఇరువురు నేతలు ఒంగోలులో ఉన్నా, పక్కపక్కనే ఉన్నా కార్యకర్తలు విడిగా సమావేశాలు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఇటీవల ఒంగోలులో ఎంపీ నిధులతో రోడ్డు వేసే కార్యక్రమానికి బాలినేని హాజరు కాలేదు. ఇది అధికారిక కార్యక్రమమే అయినా బాలినేని లేకపోవడం చూస్తుంటే విభేదాలు ఉన్నాయని తెలుస్తోందని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో ఇప్పటికే నలుగురు ప్రజాప్రతినిధులు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు, వైవి సుబ్బారెడ్డి, బాలినేనిలు మాత్రం ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారని చెబుతున్నారు. మరో విషయమేమంటే ఇంత జరుగుతున్నా వారి మధ్య జగన్ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయడం లేదా అనే చర్చ సాగుతోంది.