తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
తొలి నుంచి తారకరత్న చికిత్స విషయంలో బాధ్యత తీసుకున్న నందమూరి బాలకృష్ణ మరో సంకల్పం తీసుకున్నారు.
తారకరత్న తిరిగి కోలుకోవటం కోసం నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు.తాజాగా బాలయ్య తీసుకున్న సంకల్పం..బాధ్యత అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. కుప్పంలో తారక రత్న గుండె పోటుకు గురైన సమయం నుంచి బాలయ్య ప్రతీ క్షణం తారకరత్న ప్రాణాలు దక్కించుకోవటంలో కీలకంగా వ్యవహరించారు. కుప్పం ఆస్పత్రి నుంచి బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించటం..వైద్యులతో నిరంతర సంప్రదింపులతో ప్రతీ క్షణం అప్రమత్తంగా వ్యవహరించారు.
తొలుత తారకరత్న గుండె కొట్టుకోవటంలో అంతరాయం ఏర్పడిన సమయంలోనూ బాలయ్య స్పందించిన తీరు కారణంగానే తిరిగి తారకరత్న కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఇక, ఇప్పుడు బాలయ్య మరో సంకల్పం తీసుకున్నారు.
తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని కోరతూ బాలకృష్ణ అఖండ దీపారాధన చేపట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయస్వామి ఆలయంలో అఖండ జ్యోతి కొనసాగుతోంది. కఠోర దీక్షతో నియమబద్ధంగా ఈ అఖండ దీపారాధన కొనసాగుతోంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. దీపాలను ప్రమిదల్లో పెట్టకుండా కేవలం మట్టి, కంచు పాత్రల్లో మాత్రమే వెలిగిస్తారు. మృత్యుంజయస్వామి ఆలయంలో అఖండ జ్యోతి దాదాపు 44 రోజుల పాటు కొనసాగనుంది.
నిజానికి తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగవుతుందనే నమ్మకం నిజం అవుతోంది. కాళ్లు, చేతులు కదుపుతున్నారు. ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. గుండె బాగానే పనిచేస్తున్నా.. బ్రెయిన్లో సమస్యలు ఉన్నట్టు వైద్య బృందం గుర్తించినట్లు తాజాగా పరామర్శించిన వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి వెల్లడించారు. మెదడుకు సంబంధించి ట్రీట్మెంట్ ప్రారంభించే అవకాశాలున్నాయి.
తారకరత్న తిరిగి కోలుకోవటం కోసం తొలి నుంచి బాలయ్య చేస్తున్న ప్రయత్నాలను విజయ సాయిరెడ్డి అభినందించారు. తాజాగా బాలయ్య - విజయ సాయిరెడ్డి ప్రస్తుతం తారకరత్నకు అందుతున్న చికిత్స గురించి చర్చించారు. మెదడులో కొంత స్వెల్లింగ్ ఉందని, అది తగ్గితే న్యూరాలజిస్ట్ లు చికిత్స అందిస్తారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇక ఆధ్యాత్మికంగా మంచి పట్టు ఉన్న బాలకృష్ణ ఇప్పుడు అటు ఆస్ప్రత్రిలో చికిత్సతో పాటుగా మృత్యుంజయస్వామి ఆలయంలో దీపారాధన చేయిస్తున్నారు. తారకరత్న కోసం బాబాయ్ బాలయ్య చేస్తన్న ప్రయత్నాలు ఫలించాలని నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు కోరుకుంటున్నారు.