శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలకు ముఖ్య గమనిక
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్తను వినిపించింది. వారణాసి వెళ్లేందుకు వీలుగా సంబల్ పూర్ నుంచి బనారస్ మధ్య నడుస్తున్న (18311) ఎక్స్ ప్రెస్ ను విశాఖపట్నం వరకు పొడిగించారు. తమకు నేరుగా కాశీకి రైలు కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. రేపటి నుంచి ఈ రైలు పట్టాలెక్కబోతోంది. విశాఖపట్నం వరకు పొడిగించిన ఈ రైలును కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్ సంబల్ పూర్ లో ప్రారంభించారు.
బెనారస్-విశాఖ రైలు ప్రతి బుధవారం, ఆదివారాల్లో వైజాగ్ నుంచి ఉదయం 4.20 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతరోజు ఉదయం 9.25 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. అక్కడికి అరగంట ముందు వారణాసికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (18312) ప్రతి గురువారం, సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు బెనారస్ లో బయలుదేరి తర్వాతరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు మార్గమధ్యంలో బర్గార్ రోడ్, బాలంగిర్, టిట్లాఘర్, కెసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు, దేశంలోని ప్రధాన నగరాల మధ్య జర్నీ దూరాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే సెమీహైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా దాదాపు 60 మార్గాల్లో ఇవి సేవలందిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి విశాఖ, విజయవాడ నుంచి రేణిగుంట మీదగా చెన్నై, కాచిగూడ నుంచి బెంగళూరు వరకు నాలుగు వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications