బందరు మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు: బాలశౌరి విజ్ఞప్తికి బాబుఓకే
మచిలీపట్నం: పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బందరు మెడికల్ కళాశాల నిర్మాణ సమయంలోనే పింగళి పేరు పెట్టాలని కోరాను, కానీ స్థానిక మాజీ ఎమ్మెల్యే అహంకారం వల్ల సాధ్యపడలేదని ఈ సందర్భంగా బాలశౌరి తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడికి గౌరవం దగ్గబోతుంది.
మువ్వన్నెల జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకి ఈరోజు ఘన నివాళి లభించింది అని అన్నారు. మువ్వన్నెల జాతీయ పతాకం రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య పేరుని మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పెడుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

బుధవారం గాంధీ జయంతి సందర్బంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. మువ్వన్నెల జెండా ఎగుర వేస్తున్నామంటే దానికి కారణం మన బందరు వాసి పింగళి వెంకయ్య తయారుచేసిన త్రివర్ణ పతాకమేనని ఆయన పేర్కొన్నారు.
బందరులోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆ మహనీయుని పేరు పెట్టాలని సీఎం చంద్రబాబుని ఎంపీ బాలశౌరి కోరారు. ఇదే విషయంపై గతంలో సీఎం చంద్రబాబుకు లేఖ సమర్పించినట్లు గుర్తు చేశారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు మచిలీపట్నంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెడతామని ప్రకటించారు. సీఎం ప్రకటన చేసిన వెంటనే సభ జరుగుతున్న ప్రాంతంలోని ప్రజలు చప్పట్లు కొడుతా హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నో పోరాటాలు చేసిన మహనీయునికి నివాళి
భారత దేశానికి స్వాతంత్ర్యం రావడం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన మహనీయులు పింగళి వెంకయ్య అని ఎంపీ బాలశౌరి తెలిపారు. కృష్ణా జిల్లాలో పుట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొని, గాంధీజీ లాంటి గొప్ప నాయకులకు ఇష్టుడిగా మారి, ఆయన కోరిక మేరకు మన దేశానికి ఒక జెండా రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య అని ఆయన కొనియాడారు. అటువంటి వ్యక్తిని, ఆయన దేశానికి చేసిన సేవను నిరంతరం స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.
అందుకే బందరు ప్రాంతంలో జన్మించిన పింగళి వెంకయ్య పేరును బందరు లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టడం ఆయనకు మనం అర్పించే ఘన నివాళి అని ఎంపీ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చి లేఖ కూడా అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఫలించిన ఎంపీ బాలశౌరి కృషి
బందరు మెడికల్ కళాశాలకు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెడతామని సీఎం చంద్రబాబు చెప్పడం చారిత్రాత్మకమని ఎంపీ బాలశౌరి తెలిపారు. గతంలో అనేక సందర్బల్లో పింగళి వెంకయ్య పేరును మెడికల్ కళాశాలకు పెట్టాలని కోరినా... స్థానిక మాజీ ఎమ్మెల్యే అహంకారంతో ఆ మహనీయుని పేరు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి పర్యటనలోనే పింగళి పేరు వైద్య కళాశాలకు పెడుతున్నట్లు చెప్పి బందరు ప్రజలకు శుభవార్త చెప్పారన్నారు. ఈ సందర్బంగా ఎంపీ బాలశౌరి సీఎం చంద్రబాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications