బాబుకు చికాగో వర్సిటీ డాక్టరేట్ వెనుక కథ..!: తెలుగువాళ్లే చక్రం తిప్పారా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అమెరికా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వడంపై.. వైసిపి అధినేత జగన్కు చెందిన సాక్షిలో ఓ వార్తను ఇచ్చారు. బాబుగారి డాక్టరెట్ అసలు కథ అంటూ పేర్కొన్నారు.
అమెరికాలోని ఓ సాధారణ యూనివర్సిటీ మాత్రమే ఆయనకు డాక్టరేట్ ఇస్తుండగా, టిడిపి మాత్రం దానిని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన షికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు చెబుతున్నారని పేర్కొంది.
అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ షికాగో, షికాగో స్టేట్ యూనివర్సిటీ రెండు ఉన్నాయి. చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తోంది యూనివర్సిటీ ఆఫ్ షికాగో కాదని, షికాగో స్టేట్ యూనివర్సిటీ మాత్రమేనని పేర్కొంది.
యూనివర్సిటీ ఆఫ్ షికాగో అయితే అమెరికాలోని టాప్ టెన్ విశ్వవిద్యాలయాల్లో ఉంటుందని, అదే చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్న షికాకో స్టేట్ యూనివర్సిటీ మాత్రం అమెరికాలోనే అత్యంత తక్కువ ర్యాంక్ ఉన్న వాటిలో ఒకటి అని పేర్కొంది. మరో విషయాన్ని కూడా ఈ పత్రిక చెప్పింది.
షికాగో స్టేట్ యూనివర్సిటీలో తెలుగువాడైన దేవీశ్రీ వి పొట్లూరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, కొన్ని నెలల క్రితమే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా ఈ యూనివర్సిటీకి వెళ్లారని, ఆ సమయంలో అక్కడి ప్రొఫెసర్ రవి అచంట మంత్రితో పాటు దగ్గరుండి సమన్వయం చేశారని పేర్కొంది.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు షికాగో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక విదేశీ రాజకీయ నాయకుడికి ఈ డాక్టరేట్ ప్రకటించడం ఇదే ప్రథమం. ఈ పురస్కారాన్ని అంగీకరించాలని కోరుతూ రాసిన లేఖను విశ్వవిద్యాలయం ప్రతినిధులు గురువారం హైదరాబాద్లో చంద్రబాబుకు అందజేశారు.
ఏపీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి, దార్శనికత, అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు, సంస్కరణ దృక్పథం కలిగి ఉన్నందుకు ఈ డాక్టరేట్ ఇస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రతినిధులు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. మహిళా సాధికారత, రైతు సంక్షేమం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, సమాజంలోని అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు చేస్తున్న కృషికి గాను పురస్కారం ఇస్తున్నట్లు తెలిపారు.