లగడపాటి పొలిటికల్ రీఎంట్రీ, చంద్రబాబు ఎవరికి చెక్ పెడతారు?
మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆయన ఏ పార్టీలో చేరుతారు? టిడిపిలో చేరితే చంద్రబాబు టిక్కెట్ ఇస్తారా? అప్పుడు ఎవరికి చెక్ పడుతుంది?
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆయన ఏ పార్టీలో చేరుతారు? టిడిపిలో చేరితే చంద్రబాబు టిక్కెట్ ఇస్తారా? అప్పుడు ఎవరికి చెక్ పడుతుంది? అనే చర్చ సాగుతోంది.
రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన లగడపాటి ఆ మేరకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, ఇటీవల పరిణామాలు ఆయన రాజకీయాల్లోకి తిరిగి వచ్చేలా కనిపిస్తున్నాయి.
లగడపాటికి భలే డిమాండ్: రాజకీయాల్లోకి రావాలంటూ స్లోగన్స్
చంద్రబాబుతో..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరుపై సర్వే చేసి ఆయనకు వివరాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగింది. పనిలో పనిగా బిజినెస్ విషయాలు కూడా మాట్లాడారు.
అభిమానుల కోరిక
తాజాగా, లగడపాటి రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు నినాదాలు చేస్తున్నారు. అయితే, ఇదంతా రాజకీయ రంగంలోకి మళ్లీ దిగే వ్యూహంలో భాగమే కావొచ్చునని అంటున్నారు.
లగడపాటి కోసం నినాదాలు
శనివారం విజయవాడ నగరంలోని కందుకూరి కళ్యాణమండపంలో కాంగ్రెస్ కార్యకర్త బెజవాడ యేహాన్ సంతాప సభ జరిగింది. ఈ సభకు లగడపాటి హాజరయ్యారు. ఈ సమయంలో ఆయన అనుచరులు లగడపాటి రావాలంటూ నినాదాలు చేశారు.
ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
లగడపాటి వస్తే ఏ పార్టీలో చేరుతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఆయన వైసిపిలోకి, బిజెపిలోకి వెళ్లే అవకాశం లేదు. ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా కనిపిస్తున్నారని, కాబట్టి సైకిల్ ఎక్కే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఎవరికో ఒకరికి చెక్ తప్పదా
అదే జరిగితే లగడపాటి విజయవాడ నుంచి లేదా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరి చంద్రబాబు.. కేశినేని నానిని (విజయవాడ ఎంపీ), గల్లా జయదేవ్ (గుంటూరు ఎంపీ)లలో ఎవరినో ఒక్కరిని పక్కకు పెట్టాల్సిందే అంటున్నారు.