గుంటూరు, విజయవాడ వెళ్లేవారికి ముఖ్య గమనిక
గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే వాహనదారులకు ముఖ్య గమనిక ఏమిటంటే.. జాతీయ రహదారి 16పై కాజ దగ్గర ఉన్న టోల్ ప్లాజాలో రుసుములు పెంచారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం సెప్టెంబరు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబరులో టోల్ ఛార్జీలు పెంచుతారు.
ఒకవైపు కారుకు రూ.110 నుంచి రూ.120.. మినీ వాహనాలకు రూ.190 నుంచి రూ.205, బస్, లారీలకు రూ.375 నుంచి రూ.410, భారీ వాహనాలకు రూ.605 నుంచి రూ.660కి పెంచారు. టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ఛార్జీలు 5-10 శాతం మధ్య పెంచుతారు. కొన్ని టోల్ ప్లాజాల్లో మాత్రం ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో ఆ నెల నుంచి ఛార్జీలు పెరుగుతాయి.

గుంటూరు విజయవాడ మధ్య ఈ కాజ టోల్గేట్ ఉంటుంది. ఇది ఎప్పుడూ రద్దీగా ఉండే కీలకమైన చెన్నై-కోల్ కతా రహదారి. గతంలో ఐదోనెంబరు జాతీయ రహదారిగా ఉండేది. ప్రస్తుతం 16వ నెంబరు జాతీయ రహదారి అయ్యింది. వాహనాల రాకపోకలు ఎక్కువ. విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి చిలకలూరిపేట వరకు ఈ రహదారిని ఎనిమిదిలైన్ల రహదారిగా అభివృద్ధి చేశారు.
ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, బెంగళూరు వెళ్లే వాహనాలు చిలకలూరిపేటవైపు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్ వెళ్లే వాహనాలు విజయవాడవైపు రాకపోకలు సాగిస్తుంటాయి. టోల్ ప్లాజా దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఫాస్టాగ్ రావడంతో కొంత ఒత్తిడి తగ్గింది.












Click it and Unblock the Notifications