దేవినేని చేరిక ఇష్టం లేదు: ఆ ఇద్దరికి చంద్రబాబు ఏం చెప్పారు
అమరావతి: బెజవాడ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీడీపీలో చేరిన తర్వాత జిల్లా రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. నెహ్రూ టీడీపీలోకి చేరిన రోజునే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్లు కలవడం చర్చనీయాంశమైంది.
ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలు సంతృప్తికరంగా లేరు. నియామక పదవులు భర్తీ చేయకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. ఇదే సమయంలో దేవినేని నెహ్రూ టీడీపీలోకి చేరడంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
టీడీపీ వ్యవవస్థాపక సభ్యులలో ఒకరైన దేవినేని నెహ్రూ 1996లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత నెహ్రూతో పాటు ఆయన కుమారుడు దేవినేని అవినాష్, అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అంతక ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నెహ్రూ టీడీపీపై ఒంటికాలిపై లేచేవారు.

కిమిడి కళా వెంకట్రావుకు బాధ్యతలు
అంతేకాదు దేవినేని నెహ్రూకి, టీడీపీకి మధ్య ఉప్పు నిప్పుగా ఉండేది. అయితే చంద్రబాబు ఏమనున్నారో ఏమో గానీ నెహ్రూను తెలుగుదేశం పార్టీలోకి పిలవాలనుకున్నారు. అయితే తాను నేరుగా రంగంలోకి దిగకుండా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో మాట్లాడకుండా ఆ పనిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుకు అప్పగించారు. కళా వెంకట్రావు కూడా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో ఈ అంశంపై చర్చించారు. కొంతమంది అయిష్టంగానే ఆమోదం తెలిపారు. దీంతో కృష్ణా పుష్కరాలు ముగిసిన వెంటనే చంద్రబాబును దేవినేని నెహ్రూ కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య సుమారు గంటన్నరసేపు భేటీ జరిగింది.

15వ తేదీన పార్టీలో అధికారికంగా
ఈ భేటీ అనంతరం బయటకు వచ్చిన దేవినేని నెహ్రూ ఈనెల 15వ తేదీన పార్టీలో అధికారికంగా చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లే ఈనెల 15న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దేవినేని నెహ్రూ టీడీపీ కండువా కప్పుకున్నారు. నెహ్రూ టీడీపీలో చేరే రోజున ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలోనే పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కలుసుకున్నారు. తాను ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాలని, సీఎం అపాయింట్మెంట్ కావాలని ప్రసాద్ కోరారు. అంతకు ముందు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇదే అభిప్రాయాన్ని కళా వెంకట్రావు దగ్గర వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ
దీంతో దేవినేని నెహ్రూ పార్టీలో చేరే రోజున ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వల్లభనేని వంశీలకు ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. ఇద్దరూ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లారు. నెహ్రూ చేరిక విషయాన్ని గతంలో నెహ్రూతో ఉన్న విభేదాలను నియోజకవర్గాలలో ఎదురయ్యే ఇబ్బందులను చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. దీంతో మీ నియోజకవర్గాలో ఎవరూ జోక్యం చేసుకోరని, మీ పని మీరు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ఈ భేటీలో త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, కృష్ణా జిల్లాలో అయిదు నియోజకవర్గాలు పెరగబోతున్నాయని చెప్పారట.

కాంగ్రెస్ పార్టీలో బలమైన నేత
ఇంకా నాయకులు కావాలని చంద్రబాబు అన్నారట. దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నేత కాబట్టి తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లాలో వైసీపీ కంటే కాంగ్రెస్ పార్టీనే మనకు బలమైన ప్రతిపక్షంగా ఉందని,
అందువల్ల నెహ్రూ లాంటి నాయకులను పార్టీలోకి వస్తామంటే తీసుకోకుండా ఎలా ఉంటామని చంద్రబాబు ప్రశ్నించారు. 2019 ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాలలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అసలు వీరిద్దరూ చంద్రబాబుని కలవడానికి ఓ కారణం ఉంది. ఇసుక రీచ్ల విషయమై పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, దేవినేని నెహ్రూ వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

వల్లభనేని వంశీ గైర్హాజరు
ఇక గతంలో వల్లభనేని వంశీ, దేవినేని నెహ్రూ వర్గాల మధ్య వివాదం నడిచింది. దీని ఫలితంగానే నెహ్రూ చేరిక సందర్భంగా జరిగిన బహిరంగసభకు వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్లు గైర్హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా సభకు హాజరుకాలేదు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే 2014 ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని నెహ్రూపై పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సభకు హాజరై నెహ్రూ రాకను స్వాగతించడంతో సీఎం చంద్రబాబు తెగ సంబరపడిపోయారు. వేదికపైనే ఆయన గద్దెను అభినందించారు.












Click it and Unblock the Notifications