ఇబ్బంది లేకుండా..: సీమాంధ్రలో భద్రాచలం డివిజన్
పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ చేసిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ముంపు గ్రామాల పునరావాసం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలంటే మొత్తం భద్రాచలం డివిజన్ సీమాంధ్రలోనే ఉండాలని రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సూచించిందట.
కేవలం ముంపు గ్రామాలను కలిపితే తెలంగాణ రాష్ట్రంలో పునరావాస పనులు చేపట్టడం సాధ్యం కాదని, అంతర్ రాష్ట్ర సమస్యలు తలెత్తి ప్రాజెక్టు పనులు నిలిచిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించిందని తెలుస్తోంది. నిర్మాణానికి ఎలాంటి సమస్యా లేకుండా ఉండాలంటే ముంపు గ్రామాలతోపాటు భద్రాచలం డివిజన్ను సీమాంధ్రకు ఇవ్వాలని నీటి పారుదల శాఖ వివరించిందని తెలుస్తోంది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలుత ముంపునకు గురయ్యే ఏడు గ్రామాల పునరావాస సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, పునరావాస, భూసేకరణ సమస్యలు, పరిష్కారాలపై మంత్రి గురువారం సమీక్షించారు. శాసనసభ సమావేశాలు వాయిదా పడిన తర్వాత మంత్రి ఈ సమీక్ష జరిపారు.
నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలవరం ఈఎన్సీ ఎం వెంకటేశ్వర రావులతోపాటు రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, భూసేకరణ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇప్పటివరకు 272 కోట్ల రూపాయల విలువైన స్పిల్వే పనులు జరిగాయని, భూసేకరణ 90 శాతం పూర్తయ్యిందని అధికారులు వివరించారు. పోలవరం పనులు, పునరావాసాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా, ముంపు ప్రాంతాల ప్రజలతో చర్చించాలని మంత్రి వారికి సూచించారు.