భారత్ బంద్: తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన బంద్ ప్రభావం, పలువురు అరెస్ట్
Recommended Video

పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ బంద్కు పలు పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్ సందర్భంగా విజయవాడలో చాలా వరకు స్కూళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు. మరోవైపు గుంటూరులో జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు వద్ద బస్సలను అడ్డుకున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళంలో బంద్ పాక్షికంగా కనిపించింది. తెల్లవారు జామునుంచే బస్సులు రోడ్లపై కనిపించాయి. బస్సులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి దాదాపు శ్రీకాకుళంలానే కనిపించింది. ఇక్కడ కూడా బస్సులు తెల్లవారుజాము నుంచే తిరగడం ప్రారంభించాయి. అడ్డుకోవాలని ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలు బస్సు డిపోల బయట బైటాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి.తిరుపతిలో శ్రీవారి భక్తులను తిరుమలకు చేరవేసే బస్సులు మినహా మరేవీ నడవడం లేదు. విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ తదితర ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications