పవన్ కల్యాణ్ పై తెలుగు స్టార్ హీరోను దించుతున్న వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారం సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సమరం నడుస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం-జనసేన కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. వైఎస్ జగన్ ను అధికారం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న పవన్ కల్యాణ్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతోపాటు అవసరమైతే తానే రెండడుగులు వెనక్కి తగ్గాలనే యోచనతో ఉన్నారు. తన అభిమానులంతా గత ఎన్నికల్లో ఓటు వేయలేదని గుర్తించారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం తనకు ఎవరైతే అభిమానులుగా ఉన్నారో వారందరి ఓట్లు జనసేనకు పడాలన్న నిశ్చయంతో ఆయన పావులు కదుపుతున్నారు.

సినిమాల పరంగా తనకు ఉన్న క్రేజ్ ను, ఇమేజ్ ను ఎన్నికలకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలోనే గతంలో ఎన్నికలు, రాజకీయ నాయకుల నేపథ్యంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను తిరిగి విడుదల చేయబోతున్నారు.
వాస్తవానికి తెలుగు పరిశ్రమలో కొంతకాలం నుంచి పాత సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికల సమయం కావడంతో గంగతో రాంబాబు సినిమాను విడుదల చేస్తే తనకు ఎంతో కలిసివస్తుందని పవన్ భావిస్తున్నారు. ఆ సినిమాలో రాజకీయ నాయకులను ఉద్దేశించి తాను చెప్పిన డైలాగులు కూడా ప్రయోజనాన్ని చూకూరుస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ కూడా వ్యూహం రచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నేపథ్యంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా చేసిన భరత్ అనే నేను సినిమాను తిరిగి విడుదల చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా క్రేజ్ ను ఉపయోగించుకోవాలని, దీన్ని విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తోంది.
కెమెరామెన్ గంగతో రాంబాబు, భరత్ అనే నేను సినిమాలు రెండూ ఈ నెలాఖరులో తిరిగి విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఏపీలో సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా రూపొందించిన వ్యూహం సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. యాత్ర 2 త్వరలోనే విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications