బ్యాంకాక్కు వెళ్ళే వారికి శుభవార్త చెప్పిన భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇకపై
ఏపీ ప్రజలకు శుభవార్త. విదేశీయానం చెయ్యాలనుకున్న, బ్యాంకాక్ వంటి దేశాలకు తిరగాలనుకున్న వారికి ఏపీలోని సరికొత్త భోగాపురం విమానాశ్రయం సాదర స్వాగతం పలుకుతుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్కు డైరెక్ట్ విమాన సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ మార్గంలో విమానాలను నడపనుంది.
ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రజలు థాయిలాండ్ వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లేదా ఢిల్లీ వంటి మెట్రో నగరాలకు వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా ప్రయాణం చెయ్యాల్సి వచ్చేది. ఇప్పుడు సొంత ప్రాంతం నుంచే నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే అవకాశం లభించటంతో సమయం, డబ్బు, శారీరక శ్రమ అన్నీ ఆదా కానున్నాయి.

వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసులు నడవనున్నాయి. భోగాపురం నుంచి ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో విమానం బయలుదేరుతుంది. ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ఈ విమానం భోగాపురం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుంది. బ్యాంకాక్ నుంచి తిరుగు ప్రయాణం ప్రతి బుధవారం, శనివారాల్లో ఉంటుంది. తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి బయలుదేరి ఉదయానికల్లా భోగాపురం చేరుకునేలా షెడ్యూల్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రయాణికులు ఒక పూర్తి రోజు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఈ డైరెక్ట్ ఫ్లైట్ ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి పెద్ద ఊతం ఇవ్వనుంది. ఈ డైరెక్ట్ ఫ్లైట్ ద్వారా థాయిలాండ్లోని బీచ్లు, సాంస్కృతిక ప్రదేశాలు, వినోద కేంద్రాలను సులభంగా సందర్శించవచ్చు. అదే సమయంలో వ్యాపార రంగానికి కూడా లాభం చేకూరనుంది. విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లోని ఫార్మా, సీఫుడ్, టెక్స్టైల్ ఎగుమతిదారులకు థాయిలాండ్తో వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.
ఎయిర్ కార్గో సదుపాయాల ద్వారా వస్తువుల రవాణా కూడా వేగవంతమవుతుంది. భోగాపురం విమానాశ్రయం దేశీయ సర్వీసులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ మార్గాల్లోకి అడుగుపెట్టడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరో మైలురాయిగా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం బ్యాంకాక్ కు నేరుగా ఫ్లైట్ ఏర్పాటు చేయటంతో ఈ ప్రాంతవాసులలో సంతోషం వ్యక్తం అవుతుంది. ఇంకేం ఇకపై ఈజీగా, నేరుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ నుండి బ్యాంకాక్ కు ప్రయాణం చేసెయ్యండి.













Click it and Unblock the Notifications
