వీడియో: భోగి వేడుకల్లో వెంకయ్య నాయుడు: మంత్రులు పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్ సహా
అమరావతి/చెన్నై: రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఈ తెల్లవారు జామున 3 గంటల నుంచే ఈ వేడుకలు పెద్ద ఎత్తున ఆరంభం అయ్యాయి. పలువురు ప్రముఖులు భోగి వేడుకలను నిర్వహించారు. భోగిమంటలను వెలిగించి.. సంప్రదాయబద్ధంగా మూడు రోజుల సంక్రాంతి పండగ ఉత్సవాలకు నాంది పలికారు. ఆదివారం నాడు కనుమ వేడుకలతో ఈ సంక్రాంతి పండగ సందడి ముగియనుంది.
ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు దంపతులు భోగీ మంటల వేడుకల్లో పాల్గొనడానికి చెన్నైకి వచ్చారు. ప్రత్యేక విమానంలో వారు గురువారమే ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. చెన్నై శెట్టూరులోని తమ నివాసంలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం భోగి వేడుకలను ఆయన చెన్నైలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని ఆయన ఈ సంవత్సరం కూడా కొనసాగించారు. ఈ తెల్లవారు జామున ఇంటి ఎదురుగా భోగి మంటలను వెలిగించారు.
వెంకయ్య నాయుడు, ఆయన భార్య ఉష.. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం భోగి మంటలను వెలిగించారు. ప్రదక్షిణలు చేశారు. దేశ ప్రజలందరూ భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ప్రతికూల ఆలోచనలు వదిలి, ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని అకాంక్షించారు. భోగి, సంక్రాంతి పండుగ ప్రజల జీవితంలో వెలుగులు, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
The Vice President, Shri M. Venkaiah Naidu and his spouse Smt. Usha Naidu celebrating Bhogi by lighting a bonfire at dawn in Chennai today. #Bhogi2022 pic.twitter.com/jEZKvuknVq
— Vice President of India (@VPSecretariat) January 14, 2022
జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులోని తన నివాసం వద్ద భోగి వేడుకలను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పట్టవస్త్రాలను ధరించి.. పూజలను నిర్వహించిన అనంతరం ఆయన భోగి మంటలను వెలిగించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థించారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని, రైతాంగానికి సమృద్ధిగా నీరు లభిస్తోందని చెప్పారు.
సమాచారం, రవాణా శాఖ మంత్రి పేర్నినాని మచిలీపట్నంలోని తన నివాసం వద్ద భోగి వేడుకలను నిర్వహించారు. తన కుమారుడు పేర్ని కిట్టుతో కలిసి భోగి మంటలను వెలిగించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన భోగి పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. తెలుగువారి అతి పెద్ద పండగ భోగి, సంక్రాంతి ప్రతి కుటుంబంలోనూ వెలుగులు, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.