జూన్ 6న రాజధానికి భూమి పూజ: నారాయణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూన్ 6న రాజధాని భూమి పూజ చేస్తారని, శంకుస్థాపన కాదని మంత్రి నారాయణ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ, బోరుపాలెం మధ్యలో 8.5 కిలోమీటర్ల వద్ద ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారని మంత్రి నారాయణ చెప్పారు.
జ్యోతిష్యులు అర్చకులతో మాట్లాడి ముహూర్తం నిర్ణయించామని ఆయన తెలిపారు. భూసేకరణ కింద రాజధానికి భూములు సేకరిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.
అవినీతి సహించేది లేదు: చంద్రబాబు
అవినీతిని సహించేది లేదని, అధికారులు పారదర్శకంగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఏడాది పాలనపై సచివాలయంలో చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పనిలో వేగం పెంచుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వడదెబ్బ తగలకుండా గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అవసరమైనవారికి మజ్జిగ అందించాలని సూచించారు.
రుణమాఫీ ప్రక్రియను సమర్థంగా పర్యవేక్షించాలని, రైతు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఉద్యోగికి బదిలీ అనేది వేధింపు కాకూడదని, మాట వినకుంటే బదిలీ అనేది చివరి అస్త్రం కావాలన్నారు.