ప్రయత్నం ఆపలేదు: నంద్యాల అసెంబ్లీ స్థానంపై భూమా అఖిలప్రియ ధీమా
కర్నూలు: రాష్ట్ర పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాల అసెంబ్లీ స్థానం తమకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు.
తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టికెట్ తమదేనని, ఆ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని అఖిలప్రియ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన కోసం వేచి చూస్తున్నామని ఆమె తెలిపారు.

ప్రస్తుతం నష్టాల్లో ఉన్న పర్యాటక శాఖను లాభాల్లో నడిపించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. రాయలసీమ జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలున్నాయని చెప్పారు. అధికారులతో త్వరలో సమావేశమవుతానని చెప్పారు. పిన్నవయస్కురాలైన తనను టీడీపీ నేతలందరూ సొంత కుటుంబసభ్యురాలిగా చూసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో సీఎం చంద్రబాబును కలిశారు. 2014లో పోటీ చేసి ఓడిపోయి తీవ్రంగా నష్టపోయానని, తనకే నంద్యాల సీటు కేటాయించాలని సీఎంను ఆయన కోరారు. అయితే, అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి.. చంద్రబాబు నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.












Click it and Unblock the Notifications