చిరకాల బంధంతో భూమా మరణం: మంత్రి వర్గంలోకి అఖిలప్రియ!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించినట్లు సమాచారం. అయితే, భూమా ఆకస్మికంగా మరణించడంతో ఆయన కుమార్తె అఖిలప్రియ పేరును పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు.

సమావేశాలు ముగిశాక..
ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక... ఏప్రిల్లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. టీడీపీతో కొన్ని దశాబ్దాల అనుబంధం ఉన్న భూమా కుటుంబం మధ్యలో ప్రజారాజ్యం, వైసీపీల్లోనూ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫునే నాగిరెడ్డి, అఖిలప్రియలు ఎన్నికైనా... కిందటేడాది టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి వచ్చినప్పటికీ నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాల కథనం.

అఖిలప్రియకు అవకాశం
నంద్యాలలో నాగిరెడ్డికి రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న శిల్పా మోహన్రెడ్డికి ఇబ్బంది లేకుండా చూశాకే భూమాని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో భూమా, శిల్పా వర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు సాగాయి. ఆకస్మికంగా నాగిరెడ్డి మరణించడంతో అఖిలప్రియను తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టీడీపీతో విడదీయలేని బంధం
టీడీపీలో తిరిగి చేరిన అనంతరం భూమా నాగిరెడ్డి... ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నారు. శిల్పా సోదరులతో ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని వదులుకోవాలని సీఎం సూచించడంతో... వారితో సఖ్యంగా ఉండేందుకూ ప్రయత్నించారు భామా నాగిరెడ్డి.

చంద్రబాబుతో టచ్లోనే..
కాగా, కడప జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇందులో భూమా కుటుంబానికి సన్నిహిత బంధువైన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవి రమాణారెడ్డి వర్గానికి చెందిన 12 ఓట్లు కీలకంగా మారాయి. వారిని టీడీపీ అభ్యర్ధికి మద్దతుగా వ్యవహరించేలా చూడమని ముఖ్యమంత్రి చంద్రబాబు... భూమా నాగిరెడ్డికి చెప్పారు. ఈ విషయమై మాట్లాడేందుకు ఆదివారం ఉదయం ప్రొద్దుటూరుకు వెళ్లాల్సి ఉంది. ఈ విషయాన్ని తెల్లవారుజామునే ఆయనకు సన్నిహిత అనుచరుడు గుర్తు చేయగా... నీరసంగా ఉందని భూమా అన్నట్లు సమాచారం. అంతలోనే గుండెపోటు రావడంతో భూమా ఆకస్మికంగా మృతి చెందారు.












Click it and Unblock the Notifications