‘గంగుల’ చిన్న విషయం, బాబు అన్యాయం చేయరు: స్ట్రాంగ్ అవుతామని అఖిలప్రియ
మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ తనదైన శైలిలో స్పందించారు. గంగుల చేరికతో పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
కర్నూలు: మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ తనదైన శైలిలో స్పందించారు. గంగుల చేరికతో పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ఏం ఆశించి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆయనను పార్టీలోకి తీసుకున్నారో తనకు తెలియదని చెప్పారు.
నష్టం ఉండదు..
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే చాలా మంది టీడీపీలోకి చేరుతున్నారని అఖిలప్రియ అన్నారు. ఎవరు టీడీపీలోకి వచ్చినా.. వెళ్లినా.. భూమా ఫ్యామిలీని నమ్ముకున్న వారికి నష్టం ఉండదని అన్నారు. తాము వారిని కాపాడుకుంటామని చెప్పారు. తమ తల్లిదండ్రుల లాగే వారికి అండగా ఉంటామని చెప్పారు.
Recommended Video
బాధ పడాల్సిన అవసరం లేదు..
గంగుల చేరికపై తాను ఇంకా సీఎం చంద్రబాబుతో మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబు తమకు అన్యాయం చేయరని తాము అనుకుంటున్నట్లు అఖిలప్రియ చెప్పారు. తమకు బలమైన కేడర్ ఉందని, పార్టీలోకి ఎవరు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. గంగుల చేరిక వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని కూడా అనుకోవడం లేదని అఖిల స్పష్టం చేశారు.
ప్రయోజనం లేదు..
శుక్రవారం అఖిలప్రియ ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. గంగుల చేరికతో పార్టీకి లాభమా? నష్టమా అనేది చెప్పలేనని అన్నారు. ఎవరు వచ్చినా.. రాకపోయినా.. తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు. నంద్యాల పోలింగ్ కు నాలుగు రోజులే ఉన్నాయని, గంగుల చేరికతో ఈ ఎన్నికల్లో ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు.
భూమా ఫ్యామిలీకే ప్రాధాన్యత
తన రాజకీయ ప్రయోజనం కోసమే గంగుల టీడీపీలోకి వస్తున్నారని అఖిలప్రియ అన్నారు. రెండు వర్గాలు ఒకే పార్టీలు ఉండవని, ఎప్పుడైనా భూమా కుటుంబానికిప్రభుత్వం ప్రాధాన్యత ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. గంగులకు నంద్యాల, ఆళ్లగడ్డకు సంబంధించిన ఏ హామీ ఉండదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఆయనకు ఇంకా వేరే ఏదైనా హామీ ఇవ్వవచ్చని అన్నారు.
ఆ అవసరం లేదు..
తాను గంగులను పార్టీలోకి చేర్చుకోవద్దని ఎవరితోనూ చెప్పలేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఇదొక చిన్న విషయమని ఆమె చెప్పారు. గంగుల ఏదైనా పోస్టు తీసుకుని పార్టీలోకి వస్తున్నారంటే చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదని అన్నారు.
మరింత స్ట్రాంగ్ అవుతాం..
గంగుల ఏం ఆశిస్తున్నారో తమకు తెలియదని అన్నారు. తమను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బాబు ఆయనకు ఏ హామీ ఇచ్చారో తెలియదని అన్నారు. తాము బలహీన పడే అవకాశమే లేదని.. ఇంకా స్ట్రాంగ్ అవుతామని అఖిలప్రియ చెప్పారు.
బాబు ఆదేశిస్తే..
నంద్యాల ఉపఎన్నికల్లో ప్రజలు కూడా టీడీపీకి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. భూమా అభిమానులు, శ్రేణులు ఎలా పనిచేస్తాయో అందరికీ తెలుసని, భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడే ఏ ఒక్క సర్పంచి, జడ్పీటీసీ సభ్యుడు, కార్యకర్త కూడా పార్టీని, మమ్మల్ని విడిచి వెళ్లలేదని గుర్తుచేశారు. గంగుల, తమ వర్గాలు ఎక్కడా సంఘర్షణ పడవని, కలిసి పనిచేసే ప్రసక్తి లేదని వివరించారు. ఒకే పార్టీలో కలిసి ప్రయాణించాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటామని అఖిలప్రియ స్పష్టం చేశారు.