ఐదో వ్యక్తిగా బ్రహ్మానందరెడ్డి రికార్డ్: నడక నేర్పిన భూమా, ఎమ్మెల్యేను చేసిన చెల్లెళ్లు
జిల్లా రాజకీయాల్లో మరోసారి భూమా కుటుంబం తన ప్రత్యేక స్థానాన్ని చాటుకుంది. మొదట భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా శేఖర్రెడ్డి నుంచి ఈ ప్రస్థానం ప్రారంభమైంది.
కర్నూలు: జిల్లా రాజకీయాల్లో మరోసారి భూమా కుటుంబం తన ప్రత్యేక స్థానాన్ని చాటుకుంది. మొదట భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా శేఖర్రెడ్డి నుంచి ఈ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కుటుంబం నుంచి వరుసగా ఐదో వ్యక్తిని ఎమ్మెల్యే పదవి వరించడం గమనార్హం.
తొలిసారి భూమా శేఖర్ రెడ్డి.. ఆ తర్వాత నాగిరెడ్డి
భూమా శేఖర్రెడ్డి 1989లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆళ్లగడ్డ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన పదవిలో ఉండగానే 1991 జూన్ 7న కన్నుమూశారు. దీంతో 1992లో జరిగిన ఉపఎన్నికలో ఆయన సోదరుడైన భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆళ్లగడ్డ నుంచి రెండుసార్లు శాసనసభకు, నంద్యాల నుంచి ఒకసారి, నంద్యాల లోక్సభకు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
మూడో వ్యక్తి భూమా శోభానాగిరెడ్డి..
భూమా నాగిరెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి సతీమణి శోభానాగిరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
అఖిలప్రియ
శోభానాగిరెడ్డి మరణానంతరం 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
ఐదో వ్యక్తిగా బ్రహ్మానందరెడ్డి
కాగ, ఈ ఏడాది భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన తాజా ఉప ఎన్నికల్లో నంద్యాల నుంచి ఐదో వ్యక్తిగా భూమా శేఖర్రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికయ్యారు. ఒకే కుటుంబం నుంచి ఐదుగురు శాసనసభలో అడుగు పెట్టడం విశేషం.
భూమా నేర్పిన నడక..
భూమా బ్రహ్మానందరెడ్డి నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు(1989).. ఆయన తండ్రి భూమా వీరశేఖర్రెడ్డి మరణించాడు. ఆ సమయంలో నాన్న ఇక లేడు అన్న పరిజ్ఞానం కూడా లేని బాలుడు.. నాన్న తరువాత బాబాయ్ భూమా నాగిరెడ్డి చేయి పట్టుకొని నడక నేర్చుకున్నాడు. ఆయన పెంపకంలోనే బీటెక్ పూర్తిచేశాడు. ఆ వెంటనే బాబాయ్ సూచనలతో పాల వ్యాపారంలో రాణించాడు. జగత్ మిల్క్ డెయిరీ ఎండీగా ఉన్నారు.
చెల్లెళ్ల ప్రోత్సాహంతో..
అయితే, రాజకీయ అనుభవం అంతంతే. ఎన్నికలొస్తే బాబాయ్, పిన్ని భూమా నాగిరెడ్డి, శోభలు చెప్పే పనులు చేయడం.. ఏజెంట్గా కూర్చోవడం మినహా.. బ్రహ్మానందరెడ్డికి రాజకీయ వ్యూహాల పట్ల అవగాహన అంతంతే. బాబాయ్ భూమా అకాల మరణంతో చెల్లెలు, మంత్రి అఖిలప్రియ, నాగమౌనికల ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.
చంద్రబాబుకు కానుక
తొలి ప్రయత్నంలోనే నాలుగు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డిపై 27,466 ఓట్ల భారీ ఆధిక్యతతో ఘన విజయాన్ని అందుకున్నారు. టికెట్ ఇచ్చి భుజం తట్టి ప్రోత్సహించిన సీఎం చంద్రబాబుకు నంద్యాలను కానుకగా ఇచ్చారు బ్రహ్మానందరెడ్డి. యాథృచ్చికమే అయినా నాడు బాబాయ్.. నేడు అబ్బాయ్ ఇద్దరూ కూడా ఉప ఎన్నికలో ఒకే పార్టీ టికెట్పై బరిలో దిగి విజయం సాధించడం విశేషం. కాగా, 1985లో జన్మించిన బ్రహ్మానందరెడ్డికి భార్య, తల్లి, సోదరుడు ఉన్నారు.