'బాలకృష్ణ లేదా లోకేష్ను సీఎం పదవిలో కూర్చోబెట్టాలి!'
కర్నూలు/హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పదవిలో కూర్చునే నైతిక హక్కు లేదని, కావాలంటే హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణను లేదా నారా లోకేష్ను కానీ నియమించుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంగళవారం అన్నారు.
ఆయన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సుమారు 300 మంది పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రం వద్ద మాట్లాడారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పేరు వినిపిస్తోందని, కాబట్టి ఆయన పదవిలో కొనసాగడానికి అనర్హుడని అన్నారు. కావాలంటే ఆయన కొడుకు లోకేష్ లేదా బాలకృష్ణలకు పదవి అప్పగించాలన్నారు. మీరు చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారం అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.
స్వయానా పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆరే... చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇన్ని రోజులు చంద్రబాబు రాజకీయాలు సాగాయని, ఇక ముందు సాగవన్నారు.
బాబు, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: గుత్తా
చంద్రబాబు, కేసీఆర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరు సీఎంలు గ్యాంగ్ వార్ మాదిరిగా ముఠా నేతలుగా వ్యవహరిస్తున్నారన్నారు.
వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటుకు నోటు వ్యవహారం వివాదం రెండు రాష్ట్రాల మధ్య గొడవగా మార్చారన్నారు. అధికారం చేతిలో ఉందని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు.
ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు: ఈటెల
ఏపీ సీఎం చంద్రబాబును ఏపీ ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తన వ్యక్తిగత సమస్యతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. బాబుకు తన పైనే అపనమ్మకం అని, అందుకే ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నారన్నారు.