భూమా అంటే భయమా: డొక్కా,ముష్టి 300లా: నోముల
గుంటూరు/హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని నిలపకపోవడం పైన మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పైన నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంటే భయమా లేక బంధువా అని ఘాటుగా ప్రశ్నించారు.
నందిగామ ఉప ఎన్నిక్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన తంగిరాల సౌమ్య పైన పోటీకి దింపి, ఇప్పుడు ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ పైన అబ్యర్థిని దింపక పోవడాన్ని డొక్కా ప్రశ్నించారు. నందిగామలో అభ్యర్థిని బరిలోకి దింపి, ఇప్పుడు దింపక పోవడం దళితులకు వ్యతిరేకంగా కనిపిస్తోందన్నారు. ఈ విషయాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
గవర్నర్కు ఫిర్యాదు
నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీని పైన గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
అంతకుముందు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసన తెలియ చేస్తే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు.
300 ఇస్తారట!: నోముల ఎద్దేవా
శ్రీశైలంలో 700 మెగావాట్ల విద్యుత్ ఆపితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముష్టి 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తాననడం విడ్డూరమని తెరాస నేత నోముల నర్సయ్య మండిపడ్డారు. తెలంగాణకు విభజన చట్టం ప్రకారం కరెంట్ రావడం లేదన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
విద్యుత్ ఉత్పత్తి కోసమే శ్రీశైలం ప్రాజెక్టు కట్టారన్నారు. విద్యుత్ నిలిపివేయమని చెప్పేందుకు చంద్రబాబు ఎవరన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు తీరు పైన నోరు ఎందుకు మెదపడం లేదన్నారు. తెలంగాణ కరెంట్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమన్నారు.
ఇంకా ఐపీఎస్, ఐఏఎస్లను కేటాయించలేదని, అందుకే అనిశ్చితి కనిపిస్తోందన్నారు. ఇందుకు భారతీయ జనతా పార్టీ కారణం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎల్పీ నేత జానా రెడ్డి తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తెలంగాణ బొగ్గుతో రాయలసీమలో కరెంట్ తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు.