రాజీనామాకి సిద్దం.. నా సవాల్ కి నువ్వు సిద్దమా..? : జగన్ కి భూమా ఛాలెంజ్
కర్నూల్ : ప్రతిపక్షం వైసీసీ నుంచి అధికార పక్షం టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన నేతలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో.. టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తన కూతురైన మరో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియాతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా ఆవేశంగా మాట్లాడిన భూమా నాగిరెడ్డి.. డబ్బులకు అమ్ముడు పోయారంటూ వైసీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలను ఖండించారు. మరోసారి డబ్బులకు అమ్ముడపోయారన్న ఆరోపణలు చేస్తే పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తాయని జగన్ ని హెచ్చరించారు.
ఇకపోతే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నేతలు, రాజీనామా చేసి ఎన్నికలకు దిగాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తోన్న క్రమంలో.. తాము ఎన్నికలకు సిద్దమేనని ప్రకటించారు భూమా నాగిరెడ్డి. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు.
'అయితే ఎన్నికల్లో తమపై వైసీపీ ఓడిపోతే పార్టీని రాజకీయాల్లో నుంచి తప్పించేందుకు జగన్ సిద్దమా..!' అని సవాల్ విసిరారు భూమా నాగిరెడ్డి. తమ సవాల్ పై జగన్ స్పందించాలని డిమాండ్ చేసిన ఆయన, తాము డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదన్నారు. జగన్ కు తాము అంత చులకనగా కనిపిస్తున్నామా..? అని ప్రశ్నించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తమ బలం డబ్బు కాదని, తమ వెనుక ఉన్నది ప్రజాబలమని పేర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బ్రిటీష్ కాలం నుంచే తమది ఆర్థికంగా ఉన్నత కుటుంబమని, అలాంటి అవసరం తమకు లేదని అన్నారు.
సుదీర్ఘ కాలంగా.. దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచే తమ కుటుంబం నుంచి రాజకీయ నాయకులు ఉన్నారని, అప్పట్లో తమ మామ, చనిపోయిన తన భార్య, ఇప్పుడు తన కూతురు కూడా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ పుట్టనే లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఇక పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ ఆయన, తెలంగాణళో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరితే విమర్శలు చేయని జగన్, తాము పార్టీ మారితే మాత్రం ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, రాజీనామాకి 'సై' అంటూ భూమా నాగిరెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో.. దీనిపై వైసీపీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.