నోరు మెదపని 'జగన్'.. జలయజ్ఞంపై బహిరంగ చర్చకు రా!..: భూమా సవాల్
వైఎస్ హయాంలో జలయజ్ఞంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందన్న భూమా.. దానిపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు.
విజయవాడ: పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేత జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత భూమా నాగిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి టీఆర్ఎస్లో చేరితే ఇంతవరకు నోరు మెదపని జగన్.. తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా దోర్నాలలో నిర్వహించిన రైతు భరోసా యాత్ర సందర్బంగా పార్టీ ఫిరాయింపులపై జగన్ పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ భూమా మీడియాకు ముందుకు వచ్చారు. కేవలం రైతులను రెచ్చగొట్టడానికే జగన్ రైతు భరోసా యాత్రలు చేస్తున్నారని భూమా ఆరోపించారు.

వైఎస్ హయాంలో జలయజ్ఞంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందన్న భూమా.. దానిపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్ గా ఉన్నప్పుడు అన్ని ఆధారాలను సేకరించానని అన్నారు.
జగన్కు నాయకత్వ లక్షణాలే లేవని ఈ సందర్భంగా భూమా జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. వట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ రైతులకు మేలు జరుగుతుంటే.. కేవలం వారిని రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే జగన్ రైతుయాత్రలు చేస్తున్నారని భూమా అన్నారు. చంద్రబాబు విజన్ చాలా గొప్పదని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది దిశగా పయనిస్తోందని భూమా కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications