కర్నూలు ఆస్పత్రికి భూమా: కెసిఆర్పై జీవన్ ధ్వజం
హైదరాబాద్: వైద్య పరీక్షల నిమిత్తం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని కర్నూలు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆయనకు వివిధ పరీక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో ఆయనను కర్నూలు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు. హత్యాప్రయత్నం కేసులో భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కార్డియాలజీ, యురాలజీ పరీక్షలు భూమా నాగిరెడ్డికి అవసరమని నంద్యాల వైద్యులు చెప్పారు.
అమానుషం
కాగా, భూమా నాగిరెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చెయడం అమానుషమని శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసులు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అక్రమ కేసులు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులు ఎత్తేయకపోతే తాము న్యాయపోరాటం సాగిస్తామని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. భూమా నాగిరెడ్డి రెండు హత్యాప్రయత్నం కేసులు, ఓ అట్రాసిటీ కేసు నమోదయ్యాయి.
చంద్రబాబు విఫలం
రైతు రుణమాఫీ అమలులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని మాజీ శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. బూటకపు హామీలతో రైతులను, మహిళలను చంద్రబాబు దగా చేశారని ఆయన అన్నారు. తెలుగదుేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కెసిఆర్పై జీవన్ రెడ్డి ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు శాసనసభ్యుడు జీవన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్ను అనర్ఙుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుతానని హామీ ఇచ్చిన కెసిఆర్ రాజ్యాంగ విరుద్ధంగా వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్సించారు. పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు పడడం ఖాయమని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. కెసిఆర్పై చర్యలు తీసుకోవాలని ఈసిని, గవర్నర్ను కోరుతామని ఆయన చెప్పారు.