నన్ను పిలిచింది కాఫీలు, టిఫిన్లు పెట్టడానికి కాదు: చంద్రబాబుపై భూమన తీవ్రమైన వ్యాఖ్యలు
అమరావతి: తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. భూమనను 8 గంటలకు పైగా సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన భూమన మీడియాతో మాట్లాడుతూ తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
తాను తప్పు చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తుని ఘటనలో విచారించాల్సింది తనను కాదని చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. తుని ఘటనలో తనను కావాలనే వేధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు.
కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకే తనను వేధిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ రాష్ట్రంలో అరాచక, అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు.
ఆయన సీఎం ఉండొచ్చు గాక అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు నయీం అనే విషపురుగుని పుట్టించింది చంద్రబాబేనని, జడల నాగరాజు అనే సంఘ విద్రోహ శక్తిని పుట్టించింది కూడా ఆయనేనన్నారు. 1998లో ఎన్టీఆర్ రామారావుని నాదెండ్ల భాస్కరరావు పదవిచీత్యుడుని చేసిన తర్వాత అనేక వాహనాలు దగ్ధమవ్వడానికి ఆయనే కారణమని ఆరోపించారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన పదేళ్ల కాలంలో అనంతపురంలో రిజిస్టర్ కాని హత్యలు ఎన్నో ఉన్నాయని భూమన ఆరోపించారు. పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత జరిగిన దహనకాండకు పురిగొల్పిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.
తుని ఘటనలో తనను ఇరికించాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తుని ఘటన జరిగిన రోజునే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కారణమని అందుకు భూమన కరుణాకరరెడ్డి ఉపయోగపడ్డాడని చంద్రబాబు ప్రకటించారని మండిపడ్డారు. కాపు ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందువల్లే తనను విచారణకు పిలిచారని ఆయన తెలిపారు.
తుని ఘటన చోటుచేసుకున్న రోజే తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్పలకు నోటీసులు జారీ చేసి, వారిని విచారించి సీఐడీ అధికారులు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఇచ్చి ఉంటే ఈ విచారణ నిస్పక్షపాతంగా జరిగిందని ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు.
తుని ఘటనతో ఎలాంటి సంబంధం లేని తన పేరు చెప్పినప్పుడే ఇది చంద్రబాబు కుట్రగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనకు సంబంధమైన వారికి నోటీసులు ఇవ్వకుండా తనకు మాత్రమే ఇవ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. తుని ఘటనలో పోలీసులు మొదట చంద్రబాబుకు నోటీసులిచ్చి నిస్పక్షతను చాటుకోవాలన్నారు.
విచారణాధికారులు నిజాయతీగా పని చేస్తున్నట్టు భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ కేసులో వాస్తవాలు వెల్లడవ్వాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు ఎప్పుడైతే తన పేరు చెప్పాడో అప్పుడే ఈ కేసు తన నిస్పక్షపాతను కోల్పోయిందన్నారు.
తుని ఘటనకు ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకోకుండా కుట్రలో ప్రతిపక్షాన్ని ఈ కుట్రలో భాగస్వాములను చేయాలని చంద్రబాబు కుతంత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా తనను ఉద్దేశపూర్వకంగా పిలిచారని అన్నారు.
ఏ రకమైన ఆధారాలు లేవు కాబట్టి సీఐడీ అధికారులు హరికృష్ణ, భాస్కరరావులు ఈ ఘటనతో ఏ రకమైన సంబంధం ఉందా? అని తనను ప్రశ్నించారన్నారు. ఈ ఘటనతో ఏ రకమైన సంబందం లేకపోబట్టే బయటకు రావడం జరిగిందన్నారు. తనను పిలిచింది కాఫీలు, టిఫిన్లు పెట్టడానికి కాదని విచారించడానికేనని అన్నారు.
పదే పదే మిమ్మల్నే ఎందుకు పిలుస్తున్నారని ఓ విలేకరి అడగ్గా.. చంద్రబాబు పదే పదే తనను పిలవమని చెబుతున్నారు కాబట్టే పిలుస్తున్నారని చెప్పారు. సీఐడీ అధికారులు ఎప్పుడు రమ్మని పిలిస్తే అప్పుడు వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
చంద్రబాబు రాజకీయ ద్రోహీ, ప్రజాద్రోహీ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికే తుని ఘటనలో వైసీపీపై నిందలు మోపుతున్నారన్నారు. వైసీపీ నేతలను ఈ కేసులో ఇరికించి సంఘ విద్రోహ శక్తులుగా చూపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనను మానసికంగా హింసించడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు.