రాష్ట్రానికి ద్రోహం చేశారు: కిరణ్, బాబుపై భూమన ఫైర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్, చంద్రబాబులు సమైక్య ముసుగులో విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చింది సిఎం కిరణ్ కుమార్ రెడ్డేనని ఆరోపించారు.
ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ సమైక్య రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డిపై భూమన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. రాష్ట్ర సమైక్యత కోసం శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపించారని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సిఎం పదవిని గబ్బిలంలా పట్టుకుని వేలాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు మొదటి కారకుడు కిరణ్ కుమార్ రెడ్డేనని అన్నారు.
కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజన నిర్ణయానికి గంగిరెద్దులా తలూపారని సిఎంపై భూమన ధ్వజమెత్తారు. పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వారి విభజన రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.