చంద్రబాబు విదేశీ పర్యటన వెనుక సీక్రెట్ను బయటపెట్టిన జగన్ పార్టీ
అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత దేశంలోనే ఎక్కువగా కష్టపడుతున్న ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకరు. నిత్యం పరిపాలన, రాజధాని నిర్మాణ పర్యవేక్షణ, మంత్రులు ఉద్యోగులతో సమీక్షలు లాంటి వాటి నుంచి కాస్తంత పని ఒత్తిడిని తప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యనటకు వెళ్లారని టీడీపీ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు విదేశీ యాత్రలకు వెళ్లింది రిలాక్సింగ్ కోసం కాదని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన వెనుక వేరే సీక్రెట్ దాగి ఉందట. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసే విషయం చంద్రబాబుకు ముందే తెలుసంట. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే ఆగ్రహాన్ని తప్పించుకునేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనను ఖరారు చేసేశారంట.
ఈ వ్యాఖ్యాలు చేసింది ఎవరో కాదు వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కావాలని రాష్ట్రంలోని ప్రజలు చేస్తున్న ఆందోళనల నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారని అన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రత్యేకోహోదా కోసం పోరాటం చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను ఎలా కొందామా? అన్న ధ్యాసలో ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతోనే ప్రత్యేకహోదా అవసరం లేదని మాట్లాడుతున్నారన్నారు.
చంద్రబాబు... మోడీ ప్రభుత్వానికి లొంగిపోయారని మండిపడ్డారు. బాబు కంటే.. నయవంచకుడు ఎవరూ ఉండరని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు తన కుల దైవమైన వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా తిరుపతిలో 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నరేంద్ర మోడీకి వినతి పత్రం సమర్పించారని, అధికారంలోకి వచ్చాక హోదాను విస్మరించారని దుయ్యబట్టారు.