ఓటుకు నోటు: 'బాబు ఏదో రోజు దొరకడం ఖాయం, కాపాడే బాధ్యత సుజనది'
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి చంద్రబాబు ఏదో ఒకరోజు దొరకడం ఖాయమని వ్యాఖ్యానించారు.
హైదరాబాదులో ఏ చిన్నపాటి కేసులోనైనా అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారని, కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న చంద్రబాబును ఎందుకు వదిలేశారని భూమన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చంద్రబాబు పదేపదే తాను నిప్పును అని చెబుతున్నారని, అవి ప్రగల్భాలే అన్నారు. చంద్రబాబు గారు.. ఇప్పటి వరకు మీకు ఏ కోర్టు కడిగిన ముత్యమని తీర్పు చెప్పిందని భూమన ప్రశ్నించారు.
ఓటుకు నోటుపై మెమో: రేవంత్కు సమన్లు, బాబుని విచారిస్తాం! 'ట్యాపింగ్' వచ్చేనా?
వీరప్పన్, బిన్ లాడెన్లా..
ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఇరవై ఏళ్లు తప్పించుకొని తిరిగాడని, ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసునని చెప్పారు. అలాగే, బిన్ లాడెన్ లాంటి ఘోరమైనటువంటి వాడికి కూడా ఆఖరి గడియ తప్పలేదని గుర్తు చేశారు. అలాగే, చంద్రబాబు కూడా నేరాలు, ఘోరాల్లో ఇప్పటిదాకా దొరకలేదని, ఏదో ఒకరోజు దొరకడం మాత్రం ఖాయమన్నారు.
అశోక్ లొంగడని సుజన
కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు గారు ఎవరికీ లొంగరు కాబట్టి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును కాపాడే బాధ్యతను కేంద్రమంత్రి సుజనా చౌదరి తన భుజాన వేసుకున్నారని భూమన ఆరోపించారు.
సుజనా! హడావిడిగా ఎందుకు కలిశావ్
సుజనా చౌదరి గవర్నర్ నరసింహన్ను హడావుడిగా ఎందుకు కలిశారో చెప్పారని భూమన నిలదీశారు. ఇంత హఠాత్తుగా కలవడం వెనుక కారణం ఏమిటన్నారు. ప్రత్యేక హోదాకు గవర్నర్రకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గవర్నర్ తీరు పైన అపనమ్మకం కలిగేలా టిడిపి వ్యవహరిస్తోందన్నారు. దీనిపై రాజ్ భవన్ వర్గాలు ప్రకటన చేయాలన్నారు.