విభజన: చంద్రబాబుకు సవాళ్ల మీద సవాళ్లు, కెసిఆర్ హ్యాపీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి రెండేళ్లవుతోంది. తెలంగాణ ద్వితీయ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం సవాళ్లను గుర్తు చేసుకునే పరిస్థితిలో పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు సవాళ్ల మీద సవాళ్లు ఎదుర్కుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం దాన్నో సంబరంగా మార్చుకున్నారు. బహుశా ఇటువంటి వాతావరణం సహజమే కావచ్చు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజలకు రాష్ట్రం అవతరించింది. పైగా, దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒక్కటైన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం రాజధానిగా ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ పదేళ్ల పాటు హైదరాబాద్ను రాజధానిగా వాడుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఇక్కడ ఏమీ చేయలేని స్థితిలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను చంద్రబాబు హైదరాబాదులో చేయలేరు. అది ఎపి ప్రజలకు రుచించని విషయంగా కూడా ఉంటుంది. అలాగే, కేవలం పాలనను నిర్వహించుకోవడానికి మాత్రమే హైదరాబాద్ చంద్రబాబుకు పనికి వస్తుంది. ఇది మాది అనే భావనను తొలగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కెసిఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని హంగూ ఆర్బాటాలతో జరపగా, చంద్రబాబు విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. అవతరణ ఎపికి చేదు ఫలమనే విషయాన్ని ఆయన నవ నిర్మాణ దీక్షలో చెప్పారు. కోరని విభజనను తమ తలలపై రుద్దారనేది ఆయన మాటల్లో వ్యక్తమైంది. ఎవరూ ఊహించని విధంగా అవమానించి రాష్ట్ర విభజన చేశారని చంద్రబాబు విమర్శించారు.
ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్ర విభజన చేశారని ఆయన అన్నారు. ఈ రోజు మన పొట్టకొట్టిన రోజు.. బజారులో పడేసిన రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎదో ముంచుకొస్తోందన్న అనుమానంతో విభజనకు వ్యతిరేకంగా పోరాడినామని ఆయన అన్నారు. ఈ భావనతో ఉన్న చంద్రబాబు రాష్ట్రావతరణ దినోత్సవాలను సంరంభంగా జరుపుకునే స్థితిలో లేరని స్పష్టంగానే తెలిసిపోతోంది.
ప్రత్యేక హోదా, తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, కాపు రిజర్వేషన్లు, లోటు బడ్జెట్ చంద్రబాబుకు సవాళ్లు విసురుతున్నాయి. ఆ సమస్యలను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారనేది అందరూ ఎదురు చూస్తున్న విషయం. అయితే, సవాళ్లను స్వీకరించే ధైర్యం తనకు ఉందని ఆయన అంటున్నారు.
తన సవాళ్లను పరిష్కరించుకోవడానికి చంద్రబాబుకు రాజకీయాలు కూడా అంత సజావుగా లేవు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉండడం ఆయనకు పెద్ద సమస్యగానే మారింది. ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సవాళ్లు విసురుతున్నారు. జగన్ను ఎంతగా చిక్కుల్లో పడేద్దామన్నా ఏదో విధంగా గొంతు విప్పుతూనే ఉన్నారు. మరో వైపు, జనసేన పార్టీతో పవన్ కల్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
బిజెపితో సఖ్యత కూడా క్రమంగా చెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును చిక్కుల్లో పడేస్తూ బిజెపి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడం చంద్రబాబుకు పెద్ద విషయమే. కానీ, సమస్యలను పరిష్కరించే సత్తా గల నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆ పేరున్న కారణం కూడా టిడిపి ఎన్నికల్లో గెలవడానికి గల కారణాల్లో ఒక్కటి. అనుభవం గల చంద్రబాబు రాష్ట్రాన్ని నిలబెట్టగలరనే విశ్వాసం పనిచేస్తూ వస్తోంది.
కాగా, కెసిఆర్ చాలా నింపాదిగా పనులు చేసుకుంటూ పోతున్నారు. నిజానికి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సమస్యలను ఎదుర్కుంటుంది. కానీ, ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అభివృద్ధి చెందిన హైదరాబాద్ కెసిఆర్కు అన్ని విధాలుగా కలిసి వస్తోంది. మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.
రాజకీయంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దాదాపుగా నిర్వీర్యమయ్యాయి. ప్రజల విశ్వాసాన్ని ఈ పార్టీలు దాదాపుగా కోల్పోయాయి. దానికితోడు, తెలంగాణ నిలబడి గెలవాలంటే కెసిఆర్ నాయకత్వం అవసమనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇతర నాయకులు ఎవరు కూడా ఆ మేరకు పనిచేయరనే అభిప్రాయం బలంగా ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి విపరీతమైన వలసలు జరిగాయి. కాంగ్రెసు నుంచి కూడా జరిగాయి. కెసిఆర్కు ఇంటిపోరు, బయటి పోరు రెండూ లేవు.
పైగా, ప్రభు్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కెసిఆర్ను బలోపేతం చేస్తున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా అవి ఉండడమే అందుకు కారణం. రాష్ట్రం విడిపోతే తెలంగాణ తీవ్రమైన కరెంట్ సమస్యను ఎదుర్కుంంటుందని గత పాలకులు అంకెలతో సహా చెప్పారు. కానీ, ఆ సమస్య రాకుండా కెసిఆర్ చర్యలు తీసుకోవడం పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. దేన్నయినా కేసిఆర్ పరిష్కరించగలరనే నమ్మకాన్ని అది కల్పించింది.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటివి పూర్తి స్థాయిలో అమలవుతాయనే ఎదురుచూపులున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందే కాకుండా ఏర్పడిన తర్వాత కూడా మేధావులను, రచయితలను తన వైపు ఉంచుకోగలిగిన వ్యూహాన్ని కెసిఆర్ అనుసరించారు. పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. కెసిఆర్కు ఉన్న సౌకర్యాలు, వసతలు కలిసి వస్తుండగా, చంద్రబాబుకు విభజన తలెత్తిన సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి.