మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట- ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు...
టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఇవాళ మరో కేసులోనూ భారీ ఊరట లభించింది. పదోతరగతి పరీక్షా పత్రం లీక్ కేసులో నారాయణను అరెస్టు చేసిన పోలీసులకు బెయిల్ రూపంలో భారీ షాక్ తగిలింది. చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఉన్న నారాయణను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో అరెస్టు చేయాలని భావించిన ప్రభుత్వానికి హైకోర్టు ఇవాళ షాకిచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో గతంలో మున్సిపల్ మంత్రిగా నారాయణ పాత్ర ఉందని పోలీసులు ఆరోపించగా.. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసు నమోదు చేసి నారాయణను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఐడీకి కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. నారాయణపై తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.

వాస్తవానికి పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో నారాయణను హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకొచ్చి ఏపీ పోలీసులు.. అదే సమయంలో ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మరో కేసు పెట్టారు. టెన్త్ క్లాస్ లీకుల కేసులో బెయిల్ లభించినా సీఐడీ దాఖలు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణను అరెస్టు చేయొచ్చని ప్రభుత్వం భావించింది.
అయితే హైకోర్టు మాత్రం భిన్నంగా స్పందించింది. దీంతో నారాయణకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది. మరోవైపు ఇప్పటికే నారాయణకు టెన్త్ క్లాస్ పేపర్ల లీక్ కేసులో చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ పై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. అయితే ఆ కేసు విచారణకు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications