సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి భారీ ఊరట
Peddireddy Mithun Reddy: దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ ఊరట లభించింది. అరెస్టవుతారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయనను అరెస్ట్ చేయకూడదంటూ సూచించింది.
మద్యం విధానంలో మిథున్ రెడ్డి అరెస్టును ఎదుర్కొంటోన్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి సైతం వెళ్లారంటూ వార్తలొచ్చాయి. అదే సమయంలో- గతంలో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఈ క్రమంలో- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నేడు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది.
మిథున్ రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలను వినిపించారు. ముందస్తు బెయిల్ పిటీషన్ విషయంపై ఏపీ హైకోర్టులో చోటుచేసుకున్న వాదోపవాదాల గురించి వివరించారు. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందంటూ గతంలో ఏపీ సీఐడీ- ఇటీవలే హైకోర్టుకు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మను సింఘ్వీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మద్యం విధానం కేసు దర్యాప్తులో మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదంటూ ఏపీ సీఐడీ అధికారులు ఏపీ హైకోర్టుకు వివరించారనే విషయాన్ని కూడా సుప్రీం దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications