jasti krishna kishore : ఐఆర్ఎస్ కృష్ణకిషోర్ కు హైకోర్టు క్లీన్ చిట్-జగన్ సర్కార్ కేసుల కొట్టివేత
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగి అనంతరం జగన్ సర్కార్ హయాంలో టార్గెట్ గా మారిన అధికారుల్లో ఒకరైన ఐఆర్ఎస్ జాస్తి కృష్ణకిషోర్ కేసుల్లో హైకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై వైసీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల్ని కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు అక్రమమే అని హైకోర్టు తేల్చింది.
గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణకిషోర్ పై.. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నాడు రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చెయ్యడమే కాకుండా క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన సస్పెన్షన్ పై కృష్ణ కిషోర్ క్యాట్ ను ఆశ్రయించగా, సదరు ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అనంతరం కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత విచారించిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పునిచ్చింది.ఆ తర్వాత కృష్ణ కిషోర్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో పెట్టిన సెక్షన్ లు చెల్లవని హైకోర్టు ఇవాళ కేసును కొట్టివేసింది.

ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో కృష్ణ కిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని హైకోర్టు నిర్ధారించింది. కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గాని, లాభ పడినట్లు గాని ఎక్కడా అధారాలు లేవని తేల్చి చెప్పింది. అంతే కాకుండా సిఎం జగన్ పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా, దురుద్దేశపూర్వకంగా కృష్ణ కిషోర్ పై కేసు పెట్టినట్లు హైకోర్టు నిర్థారణకు వచ్చింది. భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్థేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టి వేయదగినదిగా హైకోర్టు భావించింది.
కృష్ణ కిషోర్ హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ సర్కిల్ లో పని చేసిన సమయంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్ పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు ఇచ్చారు. దాన్ని మనసులో పెట్టుకుని కక్షసాధింపుగా అధికారంలోకి వచ్చిన తనను తరువాత సస్పెండ్ చేసి తప్పుడు కేసు బనాయించినట్లు తన పిటిషన్ లో కృష్ణ కిషోర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications