వైసీపీకి బిగ్ షాక్..! పులివెందుల గడ్డపై టీడీపీ ఘన విజయం..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంతగడ్డపై అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. పులివెందుల జడ్పీటీసీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలలో హోరా హోరీగా పోటీ పడిన టీడీపీ.. చివరికి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్ధి, ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి ఏకంగా 6050 ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు.
పులివెందుల జడ్పీటీసీ స్ధానానికి మొన్న జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి మారెడ్డి లతారెడ్డికి మొత్తం 6735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ధి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్ధి లతారెడ్డి ఏకంగా 6050 ఓట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. పోలింగ్ రోజు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రెండో రోజు రీపోలింగ్ ను, ఇవాళ కౌంటింగ్ ను సైతం బహిష్కరించిన వైసీపీ అనుకున్న ఫలితం కాకపోయినా పరువు దక్కించుకోవడంలోనూ విఫలమైంది.

జగన్ అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో ఓ చిన్న జడ్పీటీసీ సీటును కాపాడుకోవడంలో వైసీపీ విఫలం కావడం రాబోయే రోజుల్లో ఆ పార్టీపై పెను ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 సీట్లలో కేవలం మూడు సీట్లు గెల్చుకున్న వైసీపీకి ఇప్పుడు ఉపఎన్నికలో ఓటమి మరింత కుంగదీస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని విదేశాల నుంచి రప్పించిన అభ్యర్ధి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ గా మారింది.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వాస్తవానికి వైసీపీ ముందుగానే అభ్యర్ధిని ఖరారు చేసింది. వైసీపీ సిట్టింగ్ సీటు కావడంతో ఇక్కడ చనిపోయిన జడ్పీటీసీ కుమారుడు హేమంత్ రెడ్డిని విదేశాల నుంచి రప్పించి పోటీలో నిలబెట్టింది. కానీ టీడీపీ మాత్రం చివరి నిమిషంలో మారెడ్డి లతారెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేసింది. అయితే అధికారంలో ఉండటం ఒక్కటే టీడీపీకి కలిసొచ్చింది. పులివెందుల జడ్పీటీసీ పోరులో లతారెడ్డితో పోలిస్తే బలహీన అభ్యర్ధిగా కనిపించిన హేమంత్ రెడ్డివైపు ఓటర్లు ఏమాత్రం మొగ్గు చూపలేదు.












Click it and Unblock the Notifications