యూట్యూబర్ సీమరాజా, కిర్రాక్ ఆర్పీ లకు బిగ్ షాక్..
యూట్యూబర్ సీమరాజా, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ లకు బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా సహా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ మీద పార్టీ, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని.. చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారు.
పోలీసుల మొండివైఖరి..
అంబటి రాంబాబు ఇంకా మాట్లాడుతూ.. ఇలాంటి దురాగతాలపై మునుపే ఫిర్యాదు చేశామని.. కానీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. టీడీపీ నేతల ఫిర్యాదులు వస్తే వెంటనే పోలీసులు స్పందిస్తున్నప్పటికీ.. వైసీపీ నేతల ఫిర్యాదులపై మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. చట్టాన్ని మించిన వారు ఎవరూ లేరని.. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకూ వెళ్తామని స్పష్టం చేశారు. న్యాయం కోసం పోరాటం ఆపేది లేదని అంబటి వ్యాఖ్యానించారు.

ఐటీడీపీ పైనా..
అంతే కాకుండా టీడీపీకి చెందిన ఐటీ విభాగం (ఐటీడీపీ) కూడా ఈ దుష్ప్రచారానికి పాల్పడుతోందని, సోషల్ మీడియాలో రాజకీయ శిష్టాచారానికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఐటీడీపీ ద్వారా నడిచే పేజీలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. విమర్శలు, చర్చలు ప్రజాస్వామ్యంలో సహజమే కానీ అవి గౌరవపూర్వకంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలకు చట్టపరంగా తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications