జగన్ సర్కారుకు భారీ షాక్- రాజధాని బిల్లుల ఆమోదానికి ప్రయత్నం- బడ్జెట్ బిల్లుకే ఎసరు...
ఏపీలో మూడు రాజధానుల బిల్లుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కారు విఫలయత్నం చేసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన సమావేశాల్లో రాజధాని బిల్లులు ప్రవేశపెట్టడం కుదరకపోగా.. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు సైతం ఆమోదం లభించలేదు. దీంతో జగన్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

జగన్ సర్కారుకు మళ్లీ షాక్....
ఏపీ శాసనసభలో రాజధాని బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్న వైసీపీ ప్రభుత్వం.. మెజారిటీ లేని శాసనమండలిలో మాత్రం గతంలోలాగే తడబడింది. రాజధాని బిల్లులను రెండోసారి ప్రవేశపెడితే చాలు ఆటోమేటిగ్గా ఆమోదం లభిస్తుందని ఆశించిన ప్రభుత్వానికి విపక్ష టీడీపీ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని బిల్లులను ప్రవేశపెట్టకుండా మండలి నిబంధనలను తెరపైకి తెచ్చిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు... డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సాయంతో తమ పంతం నెగ్గించుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టకుండా రాజధాని బిల్లులు ప్రవేశపెట్టాలని వైసీపీ మంత్రులు చేసిన ప్రయత్నాలను వీరు అడుగడుగునా అడ్డుకున్నారు.

ద్రవ్య వినిమయ బిల్లుకూ చుక్కెదురే....
రాజధాని బిల్లులను ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా టీడీపీ అడుగడుగునా అడ్డుపడటంతో వైసీపీ మంత్రులకు అస్సలు అవకాశం చిక్కలేదు. దీంతో చివరి నిమిషం వరకూ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో ద్రవ్య వినిమయ బిల్లుకూ ఆమోదం లభించకుండానే శాసనమండలిని డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నిరవధికంగా వాయిదా వేసి వెళ్లిపోయారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ముందుగా చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టగా... డిప్యూటీ ఛైర్మన్ కూడా దీనిపై చర్చించాలంటూ వైసీపీ మంత్రులకు సూచించారు. వారు దానికి అంగీకరించలేదు. దీంతో సెక్షన్ 90 ప్రకారం చర్చ చేపట్టాలని విపక్ష నేత యనమలకు సూచించారు. ఆయన చర్చ ప్రారంభించగానే మంత్రులు అడ్డుకున్నారు. గందరగోళం మధ్యే సభ వాయిదా పడిపోయింది.

సభలో దాడుల పర్వం...
శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు డిప్యూటీ ఛైర్మన్ అనుమతిచ్చినా మంత్రులు ముందుకు రాకపోవడంతో టీడీపీ సెక్షన్ 90 ప్రకారం చర్చ చేపట్టగా.. మంత్రులు టీడీపీ ఎమ్మెల్సీపై దూసుకెళ్లారు. ముఖ్యంగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... ఎమ్మెల్సీ లోకేష్ పై దూసుకెళ్లగా... మరో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో వీరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంత్రుల ప్రవర్తనను లోకేష్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా.. డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వారించారు. అయినా లోకేష్ పట్టించుకోలేదు. చివరికి దాడుల పర్వం కొనసాగుతుండగానే సభ వాయిదా పడిపోయింది.

బిల్లుల భవిష్యత్తేంటి..?
శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో పాటు రాజధాని బిల్లులను కూడా ప్రవేశపెట్టకుండా టీడీపీ అడ్డుకున్న నేపథ్యంలో వీటి భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. సభా నిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలి ఆమోదం లభించకపోయినా ఆటోమేటిగ్గా రెండు వారాల్లో ఆమోదం పొందినట్లే అవుతుంది. కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే రాజధాని బిల్లుల విషయంలో మండలిలో రెండోసారి కూడా చుక్కెదురు అయిన నేపథ్యంలో వీటిని నెల రోజుల విరామంతో గవర్నర్ కు పంపి ఆటోమేటిగ్గా ఆమోదం పొందుతామని అధికార వైసీపీ చెబుతోంది. అయితే మండలిలో ప్రవేశపెట్టని బిల్లులు ఎలా గవర్నర్ ఆమోదం పొందుతాయని ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications