చంద్రబాబును కలిసిన వెంటనే టీడీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు.టికెట్ల చిచ్చు ఆ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు వల్ల టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులకు టికెట్ల దక్కని పరిస్థితి. దీంతో టికెట్ దక్కని నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీలో వర్గపోరు కూడా తారస్థాయికి చేరింది.నేతల మధ్య అధిపత్య పోరు కూడా టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఇప్పటికే టికెట్ దక్కని నేతలు చాలామంది టీడీపీకి రాజీనామా చేశారు. మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా మరో కీలక నేత టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కీలక నేత గుండ దంపతులు క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గుండ లక్ష్మీదేవి గతంలో శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె భర్త గుండ అప్పల సూర్యనారాయణ సైతం మంత్రిగా పని చేశారు.

జిల్లాలో ఓ వెలుగు వెలిగిన గుండ దంపతులకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. పార్టీ కీలక నేత అచ్చెన్నాయుడుతో గుండ దంపతులకు తీవ్ర విభేదాలున్నాయి. అచ్చెన్నాయుడు జిల్లాలో తమని అణచి వేస్తున్నారంటూ గుండ లక్ష్మీదేవి వర్గం ఆరోపించింది. గతంలో మీడియా ముందు బహిరంగంగానే అచ్చెన్నాయుడుపై గుండ లక్ష్మీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు టికెట్ రాకుండా అచ్చెన్నాయుడు అడ్డుకున్నారని గుండ వర్గం ఆరోపిస్తోంది.
గుండ లక్ష్మీదేవిని పక్కన పెట్టి గొండు శంకర్కు చంద్రబాబు టికెట్ కేటాయించారు. లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా గొండు శంకర్కు అచ్చెన్నాయుడు టికెట్ కేటాయించారంటూ గుండ వర్గం ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం చంద్రబాబును కలిసిన గుండ దంపతులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడితో కలిసి గుండ అప్పల సూర్యనారాయ ణ, లక్ష్మీదేవి దంపతులు పలాసలో బస చేసిన చంద్రబాబును కలిశారు.
బస్సులో తనను కలిసిన గుండ దంపతులకు ముఖం మీదే ఆయన తన అభిప్రాయాన్ని చెప్పేశారు. శ్రీకాకుళం అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని, ప్రస్తుత అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేయాలని గుండ దంపతులకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుండ దంపతులు తాము క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications