వైజాగ్ కు కేంద్రం వరుస షాకులు-రాయగడ కేంద్రంగా రైల్వేజోన్ ?- స్టీల్ ప్రైవేటీకరణ వేగవంతం
ఏపీలో కొత్త కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తుంటే అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం వరుస షాకులిస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు నిలయంగా ఉన్న విశాఖలో వాటి ఉనికిని ప్రశ్నార్దకం చేసేలా ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం.. తాజాగా మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి కొత్తగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించింది కాగా.. మరొకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించింది కావడం విశేషం.

వైజాగ్ కు కేంద్రం భారీ షాకులు
ఏపీలో కొత్త కార్యనిర్వాహక రాజధాని విశాఖకు కేంద్రం వరుస షాకులిస్తోంది. ఇప్పటికే విశాఖకు మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్న కేంద్రం తాజాగా మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది విశాఖ రాజధాని భవిష్యత్తుకు ఈ నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొత్త రాజధానికి కేంద్రం నిర్ణయాలు శరాఘాతంగా మారబోతున్నాయి. అందులో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినది అయితే మరొకటి రైల్వే జోన్ కు గురించి కావడం విశేషం. వీటిపై వైసీపీ సర్కార్ కూడా నోరు మెదిపే పరిస్ధితి లేకపోవడంతో కేంద్రం కూడా వేగంగా అడుగులు వేస్తోంది.

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు సలహాదారులు
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం వరుస ఆందోళనలతో కొంత మౌనంగా ఉన్నట్లు కనిపించినా తాజాగా వేగం పెంచుంది. ఇందుకోసం ఇద్దరు సలహాదారులను నియమిస్తోంది. తద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను పరుగులు పెట్టించబోతోంది. ఏడాదిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ఇప్పటికే పార్లమెంటు వేదికగానే ప్రకటించిన కేంద్రం.. అందుకు అనుగుణంగానే ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సలహాదారుల్ని నియమిస్తోంది. ఇందులో ఒకరు లావాదేవీల సలహాదారు కాగా మరొకరు న్యాయ సలహాదారు. వీరిద్దరి నియామకానికి వీలుగా త్వరలో టెండర్లు పిలిచేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది

రాయగడ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్
2014లో జరిగిన ఏపీ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం తెరవెనుక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఒడిశాలో రాయగడ డివిజన్ ఏర్పాటుకు వేగంగా పనులు పూర్తి చేస్తోంది. అయితే ఏపీ కోరుకున్న విధంగా వాల్తేరు డివిజన్ కు కాకుండా రాయగడ డివిజన్ కేంద్రంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటనేదీ రాకపోయినా రాయగడ డివిజన్ ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే వాల్తేరుకు బదులుగా రాయగడ కేంద్రంగా ఇది ఏర్పాటు కావడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే ఈ రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఏపీకి ఎలాంటి ఉపయోగం లేనట్లే.

ఒడిశా లాబీయింగ్ తో ఏపీకి తీరని నష్ఠం
తూర్పు కోస్తా రైల్వే జోన్ లో కొంత భాగాన్ని, దక్షిణ మధ్య రైల్వేలో కొంత భాగాన్ని తీసుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని వల్ల ఏపీకి ఏ మేరకు న్యాయం జరుగుతుందీ అంటే కేంద్రం వద్ద సమాధానం లేదు. ఎందుకంటే వాల్తేరు డివిజన్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఏపీ డిమాండ్ చేస్తుండగా.. ఒడిశా ఒత్తిడితో రాయగడ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. దీంతో ఏపీకి తీరని నష్టం ఖాయం. ఈ కొత్త రైల్వే జోన్ ఏర్పాటైనా ఆదాయం తిరిగి రాయగఢ డివిజన్ కే వెళ్లిపోవడం ఖాయం. దీంతో ఏపీకి విభజన సందర్భఁగా ఇచ్చిన హామీని ఒడిశా ఒత్తిడితో కేంద్రం తుంగలో తొక్కుతున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications