సీఎం జగన్ కు కావాల్సింది చేస్తామంటున్న నితీష్ - ముఖ్యమంత్రి అంగీకరిస్తారా..!!
ఏపీ సీఎం జగన్ ను ఆకర్షించే ప్రకటన చేసారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. జాతీయ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ప్రధాని మోదీ టార్గెట్ గా విపక్షాలు ఒక్కటవుతున్నాయి. అందులో తెలంగాణ- బీహార్ ముఖ్యమంత్రులు కేసీఆర్..నితీశ్ కీలకంగా మారారు. అందులో భాగంగా..బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ప్రధాని అభ్యర్ది ఎవరనేది మాత్రం ఇప్పట్లో తేలే అవకాశం కనిపించటం లేదు. ఇక, లోక్ సభలో ఇప్పుడు బలా బలాలను చూస్తూ ఏపీలోని అధికార వైసీపీ లోక్ సభలో నాలుగో పెద్ద పార్టీగా ఉంది.
ప్రధాని - సీఎం జగన్ మధ్య సత్సంబంధాలు
వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకి ఏపీలో మెజార్టీ లోక్ సభ సీట్లు దక్కుతాయని ఈ మధ్య కాలంలో వచ్చిన సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే, 2019 ఎన్నికల ముందు నుంచి సీఎం జగన్ కేంద్రంలో బీజేపీ ముఖ్యులతో సన్నిహితంగా ఉంటున్నారు. గత ఎన్నికల వేళ.. 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పుకొచ్చారు. కానీ, కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావటం..ఎవరి మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో...గట్టిగా డిమాండ్ చేసే అవకాశం లేదని, ప్రతీ సందర్భంలో హోదా గురించి అడుగుతూనే ఉంటామని జగన్ చెప్పారు. అదే సందర్భంలో ఏపీకి ఎవరు హోదా ఇస్తే అది ఎవరైనా మద్దతిస్తామని గతంలోనే జగన్ స్పష్టం చేసారు. ఇప్పుడు బీహార్ సీఎం నితీశ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
నితీశ్ ప్రకటనపై జగన్ స్పందిస్తారా
సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీల కూటమి అధికారంలోకి వస్తే.. బిహార్తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. నితీశ్..కేసీఆర్ తో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు ఉంది. ఎన్డీఏలో అధికారికంగా లేకపోయినా.. ప్రతీ సందర్భంలోనూ బీజేపీకి సీఎం జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో మైత్రి కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా పైన నితీశ్ చేసిన వ్యాఖ్యలతో...ప్రతిపక్షాల పోరాటంలో జగన్ వారితో చేతులు కలుపుతారా.. హోదా నినాదం జగన్ మనసు మారుస్తుందా అనే చర్చ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం గతంలో ఏపీకి ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడారు. తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఇప్పుడు నితీశ్ చేసిన వ్యాఖ్యల పైన కేసీఆర్ స్పందించాల్సి ఉంది. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న ఈ పార్టీలతో ఇప్పటికిప్పుడు ఏపీ సీఎం జగన్ కలిసే అవకాశం లేదనే విశ్లేషణలు మొదలయ్యాయి.
టీడీపీతో బీజేపీ సంబంధాలే ఆధారంగా
టీడీపీ ప్రస్తుతం ఎన్నికల తరహాలో మూడు పార్టీలు కలిసి..జగన్ ను ఓడించేందుకు ఎన్నికల బరిలోకి దిగాలని కోరుకుంటోంది. టీడీపీతో బీజేపీ వైఖరికి అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో కేంద్రంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటిగా నిలిచే అవకాశం.. ప్రధాని అభ్యర్ధి పైన ఏకాభిప్రాయం సాధ్యమేనా అనే చర్చ కూడా మొదలైంది. దీంతో.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాతనే సీఎం జగన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు నితీశ్ చేసిన వ్యాఖ్యల తరువాత హోదా అంశం ప్రధానంగా రాజకీయ చర్చ మరోసారి తెర పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ రాజకీయ అడుగుల పైన ఆసక్తి నెలకొని ఉంది.