ఏపీలో బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీ: టీలో సింగపూర్ మోడల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేసీ బిర్లా హామ్టెక్ ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం పెట్నికోటలో సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చంద్రబాబుకు తెలిపారు.
ఈ కర్మాగారం వల్ల కనీసం నాలుగు వేలమందికి ఉపాధి లభిస్తుందని వారు వివరించారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని అనుమతులు లభించేలా చూస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సింగపూర్ తరహాలో...
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అనుమతికి సింగపూర్ తరహా వ్యవస్థను అనుసరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు. ఈ మేరకు ఆ దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు 'సింగిల్ విండో సిస్టమ్' ద్వారా అనుమతులు ఇస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 22, 23న కేసీఆర్ సింగపూర్ లో పర్యటిస్తారు. అప్పుడే ఆ విధానంపై పూర్తిగా తెలుసుకోనున్నారట. దాంతో, తక్కువ సమయంలో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక విధానంలో విజయం సాధించవచ్చుననుకుంటున్నారు.
ఈ క్రమంలో కొత్త పరిశ్రమల పాలసీ ప్రకటనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్కు సంబంధించిన ముసాయిదా ప్రక్రియను కూడా మొదలుపెట్టిందట. దాంతో, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సీఎం, సీనియర్ అధికారులతో కలసి సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడ రాఫెల్స్ సిటీలో ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసే సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తారు.