భూమి సిద్ధం, చైనా తరహా పారిశ్రామిక పార్క్పై కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు రెండున్నర లక్షల ఎకరాల భూమి గుర్తించామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిఎస్ఐఐసి) ద్వారా పరిశ్రమలకు భూములు కేటాయించనున్నట్టు చెప్పారు. అలాగే, చైనా తరహాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాన్ని అవలంభించనున్నట్టు కేసీఆర్ పేర్కొన్నారు.
బిర్లా కంపెనీ ఛైర్మన్ సికె బిర్లా, కంపెనీ ఎండి దీపక్ కేత్ర శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానం గురించి బిర్లాతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేయనున్న పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యున్నతంగా ఉండాలని బిర్లా కోరారు. తెలంగాణలో పారిశ్రామిక , వైద్య రంగాల్లో సేవలు అందించేందుకు బిర్లా కంపెనీ ఆసక్తితో ఉందని కేసీఆర్కు వివరించారు.
తెలంగాణలోని సిమెంట్ ఫ్యాక్టరీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు సత్వరం అనుమతులు మంజూరు చేయనున్నట్టు ఈ సందర్భంగా బిర్లా గ్రూప్ ప్రతినిధులకు కేసీఆర్ తెలిపారు. దీనికోసం దేశంలోనే అత్యుత్తమమైన సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. రెండు మూడు వారాల్లోనే అనుమతులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
చైనా మాదిరిగా ఇండస్ట్రియల్ పార్క్లను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారిశ్రామిక విధానం రూపొందిస్తామని, పారిశ్రామిక అనుమతుల విషయంలో క్షేత్రస్థాయిలో అనవసర ఇబ్బందులు రాకుండా చూసేందుకు సరళమైన విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. దీనికోసం ఒక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం పట్ల బిర్లా ఆసక్తి చూపించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని బిర్లా తెలిపారు.