పట్టిసీమలో భారీ అవినీతి, మమ్మల్ని గెంటేశారు: విష్ణు, నెల తిరక్కుండానే సిబిఐ విచారణ: దేవినేని
అమరావతి: ఏపీ శాసన సభలో బుధవారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజుల మధ్య వాడిగావేడిగా చర్చ జరిగింది. పట్టిసీమ అధ్భుతమని చెబుతూ, అందులో అక్రమాలు జరిగాయని విష్ణు ఆరోపించారు.
చదవండి: అంతా బీజేపీ నాటకం, బయటకు వచ్చామనే: ఏపీ అసెంబ్లీలో నేతల మాటల యుద్ధం
క్యూబిక్ మీటర్ మట్టి తీసేందుకు రూ.21,350 ఖర్చు చేశారన్నారు. రూ.371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, అవినీతి జరగలేదని టీడీపీ నేతలు విమర్శించగా.. మీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని, మేమూ చేస్తామని సవాల్ విసిరారు.
చదవండి: నో వర్క్.. నో పే.. వారికి వేతనం ఇవ్వొద్దు: బీజేపీ నేతకు దిమ్మతిరిగే షాకిచ్చిన కవిత
లారీ ఇసుక కొని చూడండని సెటైర్
సభను మంత్రి తప్పుదోవ పట్టించవద్దని విష్ణు కుమార్ రాజు ధ్వజమెత్తారు. పట్టిసీమలో కచ్చితంగా అవినీతి జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని మీకు అంత ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. తాము పోలవరం, పట్టిసీమను తప్పు పట్టలేదని, అవి అద్భుత ప్రాజెక్టులు అన్నారు. కానీ అవినీతిని ప్రశ్నిస్తున్నామన్నారు. ఓ లారీ ఇసుక డబ్బులు లేకుండా కొని చూడండని ఓ సందర్భంలో ఎద్దేవా చేశారు.
మీరు రాజకీయ కారణాలతో మమ్మల్ని గెంటేశారు
తాము వైసీపీ స్క్రిప్ట్ చదువుతున్నామని చెప్పడం సరికాదని విష్ణు అన్నారు. మీరు ఏదో రాజకీయ కారణాలతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. మీరే మమ్మల్ని రాజకీయాల కోసం బయటకు గెంటేశారన్నారు. తమ మీద బురద జల్లడం సరికాదన్నారు.
ఆహా.. మోడీ స్క్రీప్ట్.. ఆహా ఏమి డ్రామాలు
ఇందుకు దేవినేని మాట్లాడుతూ.. పోలవరం ఆపాలనే కేంద్రం ఇచ్చిన స్క్రిప్ట్ను చదివారని దేవినేని అన్నారు. ఏం స్క్రిప్ట్ చదువుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నెల తిరగకుండానే సీబీఐ విచారణా అని ప్రశ్నించారు. ఆహా.. మోడీ స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. ఆహా ఏమి డ్రామాలు మొదలు పెట్టారన్నారు. వృథా జలాలు వినియోగించుకోవడానికే పట్టిసీమ అన్నారు.
ఓ ప్లాన్ ప్రకారమే దాడి
వైసీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయాల్లో ఓ మాట మాట్లాడితే పద్ధతి ఉండాలన్నారు. ముందు మీరు ఏపీ ప్రజలు అని, ఆ తర్వాత బీజేపీ నాయకులు అని, కాబట్టి మొదట బీజేపీ నేతలు రాష్ట్రం గురించి మాట్లాడాలన్నారు. పోలవరం నిర్మాణానికి అడ్డుపడతారా అన్నారు. ఓ ప్లాన్ ప్రకారమే బీజేపీ దాడి చేస్తోందన్నారు.
మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు
ఏపీ రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని కూడా కాగ్ చెప్పిందని, దానిని కేంద్రం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని టీడీపీ సభ్యులు కూన రవి ప్రశ్నించారు. విష్ణు మాట్లాడుతూ.. పట్టిసీమలో వంద శాతం అవినీతి జరిగిందని చెప్పారు. అయితే తాను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నారు. మేం అవినీతి జరిగిందంటే మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. అనంతరం దేవినేని మాట్లాడుతూ.. బీజేపీ సభ్యులు గతంలో ప్రశంసించారని చెప్పారు. అవినీతి నిరాధార ఆరోపణలు అని, కుట్రపూరితం అన్నారు.