"పవన్ కల్యాణ్! వెంకయ్యను విమర్శించే అర్హతా ఉందా?"
అనంతపురం:కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును విమర్శించే అర్హత జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్కు లేదని అనంతపురం జిల్లా బిజెపి అధ్యక్షులు అంకాల్రెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండలోని ఆర్అండ్బి వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని జనసేన నేత పవన్ కల్యాణ్ విమర్శించడం దారుణమని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడిపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. గత సాధారణ ఎన్నికలలో ఎన్డిఎ తరపున పవన్కల్యాణ్ ప్రచారం చేశారన్నారు.

ఎన్డిఏ అధికారంలోకి వచ్చి రెండెన్నర సంవత్సరాలు అవుతోందని, రాష్ట్ర విభజన అనంతరం విభజనలో పొందుపరిచిన హామీలలో 90 శాతం ఎన్డిఎ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి వంద శాతం నిధులు కేటాయించిందన్నారు.
ప్రత్యే క ప్యాకేజీ కింద రూ.2.25 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇవన్ని పవన్కల్యాణ్కు కన్పించలేదా అని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి మజ్ధూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వెంకటేశులు, పురుషోత్తం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోకా వెంకప్ప, నియోజకవర్గ కన్వీనర్ గోపాల్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఖలంధర్, బిజెపి కార్యదర్శి లక్ష్మినారాయణ, నాయకులు నెట్టెం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications