కేంద్రం జోక్యం అప్పుడే: రాజధానిపై బీజేపీ ఉద్దేశమదే: కన్నా క్లారిటీ..!
అమరావతి నుండి రాజధాని తరలింపు అంశం పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి నుంచి విశాఖపట్టణానికి హెచ్ఓడి తరలించడం ఆషామాషీ కాదన్నారు. విశాఖపట్నం భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వానికి మూడు లేఖలు రాశారని, అయినా స్పందించలేదన్నారు. విశాఖకు రాజధాని తరలిస్తామని చెప్పడం వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. రాజధాని తరలింపు అంశం స్టేట్ హోల్డర్స్ కానీ ప్రభుత్వం కానీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేసారు.
రాజధాని అమరావతిలో ఉండాలన్నదే బీజేపీ ముఖ్య ఉద్దేశమని కన్నా చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రతిపాదనలకు నిరసనగా కన్నా అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం వద్ద ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌద దీక్ష చేసారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేసారు.

బీజేపీ విధానం అదే...
రాజధాని అమరావతిలో ఉండాలన్నదే బీజేపీ ముఖ్య ఉద్దేశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ స్పష్టం చేసారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనదని తేల్చి చెప్పారు. అదే సమయంలో.. రాజధాని తరలింపు పైన స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం కీలకమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత అప్పటి ప్రభుత్వం ఆలోచన మేరకు అమరావతిలో ప్రధాని శంకుస్థాపనకు వచ్చారని గుర్తు చేసారు.
అమరావతికి చేసిన ఖర్చులో కేంద్ర నిధులు కూడా ఉన్నాయని వివరించారు. అదే సమయంలో.. సచివాలయం.. అసెంబ్లీ ఒకే చోట ఉండాలనేదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. రాజధాని తరలింపు కుట్ర గా ఆయన అభివర్ణించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలన్నదే తమ ఉద్దేశమని కన్నా తేల్చి చెప్పారు.
మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి..
బీజేపీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకు పౌరసత్వ బిల్లు పైన వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఏపీ పార్టీ నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా.. పౌరసత్వ సవరణ చట్టం అపోహలు - వాస్తవాలు పేరిట కరపత్రాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంట్లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. కానీ బయటకొచ్చాక దురుద్దేశంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ మత విధ్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. జనజాగరణ అభియాన్ పేరుతో నేటి నుంచి పౌరసత్వ సవరణ చట్టం అపోహలు.. వాస్తవాలపై కరపత్రాలతో ప్రజల్లోకి వెళ్తామని కన్నా తెలిపారు.సీఏఏ చట్టం ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించడమే తప్ప భారతీయులకు వచ్చిన నష్టమేమీ లేదని కన్నా స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications