వైసీపీ ప్రభుత్వంపై చిన్నమ్మ దూకుడు - ఆర్దిక మంత్రితో భేటీ, టార్గెట్ ఫిక్స్..!!
ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు కొనసాగిస్తున్నారు. ఆర్దిక వ్యవహారాల పైన ఆరోపణలు చేస్తున్నారు. పురందేశ్వరి ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. లెక్కలు బయట పెట్టింది. ఇప్పుడు కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అప్పులే మినహా ఆస్తుల కల్పన లేదని ఆరోపించారు. నిధుల మళ్లింపును నిర్మల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
పురందేశ్వరి వినతి:ఏపీలో అప్పులు, ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు. ఏపీ వ్యవహారా ఇంచార్జ్ మురళీధరన్ తో సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ప్రభుత్వానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో 7 లక్షల 14 వేల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపిందని తెలిపారు. మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపి 8 వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు. పంచాయతీల నిధులను సైతం దారి మళ్లిస్తోందని ఆర్థికమంత్రి దృష్టికి పురందేశ్వరి తీసుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు:కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పులు అధికారికమో.. అనధికారికమో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆస్తులకు తనఖా పెట్టి చేసిన అప్పుల గురించి వివరణ ఇవ్వాలని.. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న వేల కోట్ల బిల్లులపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.
అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు ఎందుకు ఇవ్వడం లేదని.. ఆ నిధులను ప్రభుత్వం అనధికారికంగా వాడుకుందని ఆరోపించారు. వీటన్నింటిపైనా ప్రభుత్వం తగిన సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం విచక్షణ రహితంగా అప్పులు చేసి, ఆ భారాన్ని రాష్ట్రంపై, ప్రజలపై మోపుతున్న వైనాన్ని వివరించినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలోనే పొత్తులు:పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వ అప్పులు, కేంద్ర నిధుల మళ్లింపుపై ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. పొత్తులపైనా ఆసక్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన తో పొత్తు కొనసాగుతందన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పొత్తులపైన పార్టీ నాయకత్వం స్పష్టత ఇస్తుందని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని..కేంద్ర నిధులు డైవర్ట్ చేసిందంటూ చేస్తున్న ఆరోపణల పైన వైసీపీ స్పందించింది. ఇప్పటికే గణాంకాలతో సహా వివరించింది. ఇప్పుడు కేంద్ర ఆర్దిక మంత్రిని కలిసి ఫిర్యాదులు చేసారు. దీని పైన ఇప్పుడు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications